TG | నేత్రపర్వంగా లక్ష్మీనారసింహుడి తిరుకల్యాణ మహోత్సవం !

ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : సాక్షాత్తు బ్రహ్మ నిర్ణయించిన సుముహూర్తాన.. వేదమంత్రోచ్ఛారణలతో.. మంగళవాయిద్యాలు.. కర్పూర కాంతుల నడుమ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ వేడుక అంబరాన్ని తాకింది.

సర్వ జగత్తుకూ కల్పవల్లి, పుణ్యాలరాశి అయిన అమ్మవారికి మాంగల్యధారణ మహోన్నతంగా జరిగింది. దిక్కులు పిక్కటిల్లేలా ఓం నమో నారసింహాయ అంటూ నామస్మరణలు మిన్నంటిన శుభవేళ.. స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలకై భక్తజనం పోటెత్తిన సమయాన.. జగత్ కల్యాణం అందర్నీ ఆనందపారవశ్యంతో ముంచెత్తింది.

అపూర్వ ఘట్టం భక్త హృదయాల్లో ఆధ్యాత్మిక వైభవాన్ని నింపి, యాదగిరిగుట్ట పులకించింది. స్వర్ణాభరణాలతో అలంకరించిన ఉత్సవమూర్తులను వేదిక వద్ద కొలువుదీర్చినది మొదలు జరిగిన ప్రతి ఘట్టం పరమార్థంతో నిండి మనోహరంగా అలరించింది.

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం లక్ష్మీనరసింహస్వామి వారి పరిణయోత్సవం కనులపండువగా సాగింది. కొండపైన ఉత్తర ముఖ ద్వారం రథోత్సవ మండపంపై కల్యాణ ఘట్టాన్ని రాత్రి ఘనంగా నిర్వహించారు. మొదటగా ప్రధానాలయలో రాత్రి 8.25 గంటలకు గజ వాహన సేవపై స్వామివారు పెళ్లి కొడుకుగా ముస్తాబై మాఢ వీధుల్లో ఊరేగుతూ మండపానికి చేరుకున్నారు.

విశ్వక్సేనుడికి తొలిపూజలతో ప్రారంభమై.. స్వామికి యజ్ఞోపవీతధారణ జరిపి పాదప్రక్షాళన గావించారు. స్వామి, అమ్మవార్లను జీలకర్ర బెల్లంతో అలంకరించి మాంగళ్య పూజ తంతు నిర్వహించారు. బ్రహ్మముహూర్తంలో నారసింహుడు మహాలక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు.

మాంగళ్యధారణ జరిగిన తర్వాత భక్తులు దర్శించుకునే విధంగా కల్యాణమూర్తులు, కల్యాణ లక్ష్మీనృసింహులన అధిష్టింపజేశారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు శ్రీరాముడిగా భక్తులకు దర్శనమిచ్చి, హనుమంత వాహనంలో విహరించారు.

సకల సదుపాయాలు.. భారీ ఏర్పాట్లు..

పరలోకం నుంచి సకల దేవతలు వీక్షిస్తున్నట్టుగా ఇహలోకంలో యాదగిరికొండను ముస్తాబు చేశారు. కొండ చుట్టూ విద్యుద్దీపాలతో ధగధగలాడింది. నృసింహుడి క్షేత్రం స్వర్ణ శోభితను సంతరించుకుంది. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

భక్తులు కూర్చునేందుకు కుర్చీలు, వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఇబ్బందులు లేకుండా కొండ కింద పార్కింగ్ పాయింట్లు పెట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

భక్తుల తాకిడి, శాంతి భద్రతల నేపథ్యంలో డీసీపీ రాజేష్ చంద్ర నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చి.. గరుడ వాహన సేవలో విహరించనున్నారు. రాత్రి దివ్య విమాన రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *