KTR Twit | అన్నం పెట్టే అన్నదాతకు సున్నం పెట్టిన రేవంత్

హైదరాబాద్, : నీళ్లు సముద్రం పాలవుతున్నా ఒడిసిపట్టలేని అసమర్థ ప్రభుత్వం అంటూ వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం కుంగిన పిల్లర్లను చూపి నీటిని కిందకు వదిలేస్తున్నారంటూ మండిపడ్డారు. యెద్దేచ్ఛగా ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు. నీళ్లన్నీ తరలించుకు పోయిన తర్వాత అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తీరిగ్గా టెలీమెట్రీల గురించి మాట్లాడుతోంది’ అంటూ మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా ఒడిసిపట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలన పాపం ఫలితమే తెలంగాణకు కృష్ణా, గోదావరి నదీజలాల్లో నీటి వాటా తేలకపోవడానికి కారణమని ఆరోపించారు.

పదేళ్ల పాలనలో కేసీఆర్ కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను వడివడిగా పూర్తి చేసి వందల టీఎంసీలు ఒడిసిపట్టేందుకు రిజర్వాయర్లు నిర్మించారని చెప్పుకొచ్చారు. అయితే కుంగిన కాళేశ్వరం పిల్లర్లను చూపి మరమ్మతులు చేపట్టకుండా నీళ్లను కిందకు వదిలి ఇసుకను దోచుకుంటున్నారని కామెంట్స్ చేశారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 50 టీఎంసీల రిజర్వాయర్లు సిద్దంగా ఉన్నా , నీళ్లు ఎత్తిపోసుకునేందుకు నార్లాపూర్ వద్ద నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నా టెండర్లు రద్దు చేసి, 15 నెలలుగా పనులను పడావుపెట్టారన్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొలాలను ఎండబెట్టి ఇసుక వ్యాపారం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. అన్నం పెట్టే అన్నదాతకు సున్నంపెట్టి. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలను నిలువునా మోసగిస్తున్నారని.. జాగో తెలంగాణ జాగో అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ వేదిక పోస్టు చేశారు.

https://twitter.com/KTRBRS/status/1901459791819768201

Leave a Reply