ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో ఈరోజు జరగాల్సిన మ్యాచ్ రద్దు అయ్యింది. ఈడెన్ గార్డెన్స్ లో పంజాబ్ కింగ్స్ – కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది.
సరిగ్గా కోల్కతా జట్టు ఛేజింగ్ ప్రారంభించబోతుండగా వర్షం మొదలైంది. అయితే, మ్యాచ్ను కనీసం ఐదు ఓవర్లకు తగ్గించి ఆడించాలని అంపైర్లు అనుకున్నారు. కానీ వాతావరణం సహకరించలేదు. ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో చేసేదేమి లేక రెండు జట్లకు ఒక పాయింట్ చొప్పున ఇచ్చి, మ్యాచ్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కాగా, టాస్ గెలిచిన పంజాబ్ 20 ఓవర్లలో 201/4 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇద్దరు యువ ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య (35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు) – ప్రభ్సిమ్రాన్ సింగ్ (49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 83) మొదటి బంతి నుంచే రాణించారు. వీరిద్దరూ కలిసి 120 పరుగులు రికార్డ్ ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకోల్పారు.
ఇక వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ (16 బంతుల్లో 25 నాటౌట్) ఆకట్టుకోగా.. గ్లెన్ మాక్స్వెల్ (7), మార్కో జాన్సన్ (3) నిరాశపరిచారు. జోష్ ఇంగ్లిష్ (11 ) పరుగులతో నాటౌట్ గా నిలిచిచాడు. కోల్ కతా బౌలర్లలో వైభవ్ అరోరా రెండు వికెట్లు తీయగా.. వరణ్ చక్రవర్తి, రస్సెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
కోల్కతా జట్టు తమ సొంతగడ్డపై 202 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగింది. అయితే, తొలి ఓవర్లోనే మ్యాచ్ కు బ్రేక్ పడింది. స్టేడియంలో బలమైన ఈదురుగాలులతో పాటు చినుకులు పడటంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత గ్రౌండ్ సిబ్బంది పిచ్ను కవర్లతో కప్పివేశారు. తొలి ఓవర్ ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 7/0. రహ్మానుల్లా గుర్బాజ్ (1), సునీల్ నరైన్ (4).