Kerala | సిఎం విజ‌య‌న్ కు కేంద్రం షాక్.. ఆయ‌న కుమార్తెపై విచార‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్

ఎర్నాకుళం: కేర‌ళ సీఎం పిన‌రయి విజ‌య‌న్ కుమార్తె టీ వీణా విజ‌య‌న్ చిక్కుల్లో ప‌డ్డారు. ఆర్థిక నేరం కేసులో ఆమెను విచారించేందుకు కేంద్రం అనుమ‌తి ఇచ్చింది. న్యాయ విచార‌ణ చేప‌ట్టేందుకు కేంద్ర కార్పొరేట్ వ్య‌వహారాల శాఖ ఆ ఆదేశాలు జారీ చేసింది. కొచ్చిన్ మిన‌ర‌ల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వీణా విజ‌య‌న్‌కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూష‌న్స్ కంపెనీకి అక్ర‌మ రీతిలో డ‌బ్బులు బ‌దిలీ అయిన‌ట్లు తేలింది. సీరియ‌స్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీసు దాఖ‌లు చేసిన ఛార్జ్‌షీట్ ఆధారంగా కేసు విచార‌ణ‌కు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కొచ్చిలోని ఆర్థిక నేరాల‌ను పరిశీలించే ప్ర‌త్యేక కోర్టులో ఈ కేసు ఫైల్ అయ్యింది.

సీఎంఆర్ఎల్‌, ఎక్సాలాజిక్ సొల్యూష‌న్స్ మ‌ద్య అక్ర‌మ రీతిలో ఆర్థిక లావాదేవీలు జ‌రిగిన‌ట్లు అనుమానించారు. 2017 నుంచి 2020 మ‌ధ్య కాలంలో సీఎంఆర్ఎల్ కంపెనీ నుంచి వీణా విజ‌య‌న్‌కు చెందిన కంపెనీ సుమారు 1.72 కోట్లు బ‌దిలీ అయ్యాయి. దీంతో ఈకేసులో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఎస్ఎఫ్ఐఓ ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎఫ్ఐఓ త‌న ఛార్జ్‌షీట్‌లో వీణా విజ‌య‌న్‌తో పాటు సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ‌శిథ‌ర్ కార్తా, మ‌రో 25 మంది నిందితుల పేర్ల‌ను చేర్చింది.
ఒక‌వేళ ఈ కేసులో వీణ దోషిగా తేలితే, ఆర్నెళ్ల నుంచి ప‌దేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. కంపెనీస్ యాక్టు ప్ర‌కారం ఆ శిక్ష ఉంటుంది. దీంతో పాటు పెనాల్టీ విధిస్తారు. అక్ర‌మంగా వ‌సూల్ చేసిన మొత్తంపై మూడు రెట్ల జ‌రిమానా వ‌సూల్ చేయ‌నున్నారు. కంపెనీస్ యాక్టులోని సెక్ష‌న్ 447 ప్ర‌కారం ఆరోప‌ణ‌లు చేశారు. 160 పేజీల ఛార్జ్‌షీట్ రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *