
KCR | నందినగర్ నివాసానికి కేసీఆర్..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన ఆయన నేరుగా హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ నెల 21న తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ (BRSLP) కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఈ నెల 19నే జరగాల్సి ఉన్నప్పటికీ, పార్లమెంట్ సమావేశాల ముగింపు నేపథ్యంలో ఎంపీలు కూడా హాజరయ్యేలా 21వ తేదీకి వాయిదా వేశారు.
ఇక ఈ నెల 21న జరగనున్న బీఆర్ఎస్ఎల్పీ భేటీలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ పాల్గొననున్నారు. ప్రధానంగా పార్టీ సంస్థాగత బలోపేతం.. తెలంగాణ ప్రభుత్వంపై అనుసరించాల్సిన పోరాట పటాలు, గోదావరి, కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ తీరు వంటి అంశాలపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్ కు పార్టీ ప్రముఖులు కలిసి స్వాగతం పలికారు.
