BRS Party | కరీంనగర్ నేతలతో కేసీఆర్ భేటీ

హైద‌రాబాద్ – తెలంగాణ ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చేలా బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభ ఉండాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్‌ సభకు వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఉమ్మడి కరీంనగర్ బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు.

ఈ సంద‌ర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, ఈ నెల 27న వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశం పెట్టుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి లక్ష మందికి తగ్గకుండా లక్షలాది మందితో సభ నిర్వహించేలా ప్లాన్ ఉండాలన్నారు.

బీఆర్‌ఎస్‌ సిల్వర్‌జూబ్లీ సభ కోసం ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ సభకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పాలన వింతగా ఉందని కామెంట్స్‌ చేశారు. మార్పు కోరుకున్న రైతుల కళ్లల్లో కన్నీళ్లే మిగిలాయన్నారు. రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *