నవంబర్ 21 వరకు కార్తీకారాదన…

నవంబర్ 21 వరకు కార్తీకారాదన…

  • మల్లన్న గుడి సర్వన్నద్ధం
  • బుధవారం ప్రారంభం
  • ఈవో ఎం.శ్రీనివాసరావు వెల్ల‌డి..

ఆంధ్రప్రభ, శ్రీశైలం నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో అక్టోబరు 22 నుంచి నవంబరు 21 వతేదీ వరకు కార్తీకమాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

కార్తీకమాసోత్సవాల ఏర్పాట్లను మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, అధ్యాపక, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్. రమణమ్మ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఎం. నరసింహారెడ్డి, అన్ని శాఖల అధిపతులు, వివిధ విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ…. భక్తులకు దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సరఫరా, పాతాళగంగలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు, భక్తులు తలనీలాలు సమర్పణకు కల్యాణకట్టలో ఏర్పాట్లపై అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ, వైద్యఆరోగ్యసేవలు, వాహనాల పార్కింగ్, పారిశుద్ధ్యం ఏర్పాట్లపై పలు ఆదేశాలు జారీ చేశారు.

కార్తీకమాసంలో ప్రతీసోమవారం మరియు కార్తీకపౌర్ణమిరోజున జరిగే పుష్కరిణి హారతి, లక్షదీపోత్సవం, పౌర్ణమినాటి జ్వాలాతోరణోత్సవం నిర్వహిస్తామన్నారు. అక్టోబరు 31న కృష్ణమ్మహారతి, నవంబరు 14న కోటి దీపోత్సవం, నవంబరు 18న తెప్పోత్సవం ఏర్పాట్లను ఘనంగా చేపట్టాలని సూచించారు.

ప్రతీరోజు వేకువ జామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాతసకాలసేవలను జరిపించ బడతాయన్నారు.అనంతరం వేకువజామున 4.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలను కొనసాగించాలన్నారు. తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు కూడా దర్శనాలను కొనసాగిస్తామన్నారు.

సాధారణ భక్తుల సౌకర్యార్థం కార్తీకమాసమంతా కూడా గర్భాలయ అభిషేకాలను సామూహిక అభిషేకాలను పూర్తిగా నిలుపుదల చేయడం జరిగిందన్నారు. కార్తికమాసంలో శని, ఆది, సోమవారాలు పర్వదినాలలో 16 రోజులపాటు అమ్మవారి అంతరాలయంలో నిర్వహించు కుంకుమార్చనలు వెయ్యి రూపాయలు రుసుము కుంకుమార్చనలను ఆశీర్వచన మండపంలో నిర్వహిస్తామన్నారు.

ఇందులో రుద్రహోమం, చండీహోమం, సాక్షి గణపతి హోమం, నిత్యకల్యాణం మొదలైన ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. క్యూలైన్లలో ఎటువంటి తొక్కిసలాటలు లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

క్యూకాంప్లెక్సులో అల్పాహారం, బిస్కెట్లు, మంచినీటిని నిరంతరం అందిస్తుండాలన్నారు. పర్వదినాలలో క్యూలైన్లలో వేడిపాలను కూడా అందజేయాలన్నారు. ప్రతీరోజు కూడా ఉదయం 10.45 గంటల నుంచే అన్నప్రసాదవితరణను ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.

సాయంత్రం 7 గంటల నుంచి భక్తులకు అల్పాహారం అందజేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న 7 ప్రసాదాల విక్రయకేంద్రాలకు అదనంగా రద్దీని బట్టి మరో 3 లేదా 4 కౌంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని లడ్డు ప్రసాదాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

కార్తీకమాసంలో భక్తులు పుణ్యస్నానాలకు ప్రాధాన్యం ఇస్తున్న కారణంగా పాతాళగంగ వద్ద అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా చేపట్టామన్నారు. అందుకు తగ్గట్టుగా పాతాళగంగ వద్ద శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్యం, అదనపు లైటింగ్ ఏర్పాట్లు, ఈత నిపుణుల ఏర్పాట్లు మొదలైన అన్నీ కూడా ఎటువంటి లోటు లేకుండా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

భక్తులు సమాచారం తెలుసుకునేందుకు అవసరమైన అన్నీ ప్రదేశాలలో కూడా మరిన్ని సూచికబోర్డులు ఉండాలన్నారు. ఆలయ ఉత్తరమాడవీధిలోనూ మరియు ఆలయ ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద భక్తులు కార్తీక దీపరాధనకు తగు ఏర్పాట్లు వుండాలన్నారు.

కార్తీకమాసంలో నిర్వహించబడే లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలను, జ్వాలాతోరణోత్సవాన్ని, కృష్ణమ్మహారతి కార్యక్రమాలను సంప్రదాయబద్దంగా నిర్వహించాలన్నారు. ఈ సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టిన కోటిదీపోత్సవం , తెప్పోత్సవ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికబద్దమైన ఏర్పాట్లు ఉండాలన్నారు.

గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు కోటి దీపోత్సవానికి, పాతాళగంగ వద్ద తెప్పోత్సవానికి ఆయా ఏర్పాట్లన్నీ ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. స్థానిక పోలీస్‌శాఖ వారి సహకారంతో భద్రతా ఏర్పాట్లు ఉండాలన్నారు. ముఖ్యంగా వాహనాల క్రమబద్దీకరణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

క్షేత్రపరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన వీధులు మొదలైన చోట్ల చెత్తాచెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలన్నారు. కార్తీకమాసోత్సవాలలో దేవస్థానం సిబ్బందికి అదనపు విధులు కేటాయించడం జరిగిందని, సిబ్బంది అందరు కూడా పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Leave a Reply