న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. భూముల పర్యావరణ పునరుద్ధరణపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు సమయం కోసం అమికస్ క్యూరీ సుప్రీంను కోరింది. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో అనుమతులు లేకుండా చెట్లు కొట్టివేసిన వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసి సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన సంగతి విదితమే. గత విచారణ సందర్భంగా.. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశించింది.
పర్యావరణ పునరుద్దరించకపోతే అధికారులు జైలుకే!
కంచ గచ్చిబౌలి భూములలో పర్యావరణ పునరుద్ధరణ జరపకపోతే అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సీజేఐ స్పష్టం చేశారు. కంచ గచ్చిబౌలి భూముల్లో చేపట్టిన పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై రిప్లయ్ దాఖలుకు ప్రతివాదులు సమయం కోరారు. ఈ నేపథ్యంలోనే సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. కోర్టు ఆదేశాలతో తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో తెలంగాణ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది.