కాలకవృక్షీయుని ఉపదేశం

మహాభారతంలోని భీష్మపర్వంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడు. శాంతిపర్వంలో ధర్మరాజుకు భీష్ముడు శాంతనవగీతను ఉపదేశించాడు. దానినే ధర్మగీత అంటారు. భీష్మపర్వం భీష్ముడిని ప్రచండవీరునిగా గుర్తించగా.. శాంతిపర్వం అతనికి పరమ ధర్మజ్ఞుడనే ప్రఖ్యాతిని తెచ్చింది. రెంటిలోనూ ప్రవృత్తి-నివృత్తి మార్గాలు ఉపదేశితాలైనా.. ప్రవృత్తి ధర్మంగా భగవద్గీత విధి నిర్వ#హణకు మార్గం చూపగా.. నివృత్తి ధర్మంగా ధర్మగీత నిర్మల జ్ఞానాన్ని ప్రసాదిస్తూ పురుషార్థ సారాలను అందించింది. నిజానికి భగవద్గీతలో ప్రవక్తగా.. ధర్మగీతలో ప్రయోక్త కనిపించే శ్రీకృష్ణ పరమాత్మయే రెండింటిలోనూ మూలశక్తిగా కనిపిస్తాడు.
కురుక్షేత్ర యుద్ధానంతరం విజయం లభించినా ధర్మరాజుకది రక్తపు కూడుగానే కనిపించింది. తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, తదితర బంధువులే కాక అమాయకులైన ఎందరో యోధులు తన విజయానికై అసువులు అర్పించడంతో అశాంత చిత్తుడైన ధర్మరాజు ఆ విజయం విజయమే కాదని శోకభావోద్వేగానికి గురయ్యాడు. శాంతిపర్వంలో ధర్మరాజు శోకం రెండు పార్శ్వాలుగా కనిపిస్తుంది. మొదటిది బంధుజన సంహార సంబంధితం కాగా రెండవది దానిద్వారా కలిగే పాపానికి సంబంధించింది. మొదటిది ఐహికానికి సంబంధించింది కాగా రెండవది పరానికి సంబంధించింది. నారద వ్యాసాది మునుల బోధల వల్ల ధర్మరాజు కొంత కలత తీరి ఎట్టకేలకు రాజ్యపాలనకు సమ్మతించాడు. ఆ సమయంలో ధర్మరాజులో పాదుకుపోయిన రాజకీయ ధార్మిక, పారలౌకిక సందేహాలను నివృత్తి చేయడానికై శ్రీకృష్ణుడు అంపశయ్యపైనున్న భీష్ముడిని నియోగిస్తాడు. భీష్ముడు ధర్మరాజుకు బోధించిన విజ్ఞానం, తెలివిని పెంచుకునేందుకు మాత్రమే కాక ఆచరించి జీవిత విలువలను పెంచుకునేందుకు, అవగా#హనను ఆచరణగా మార్చుకునేందుకు ఉపకరించడం వల్ల సార్వకాలికమై, సర్వజనీనమై మార్గదర్శనం చేస్తున్నది.
ఆ సందర్భంలో ధర్మరాజు భీష్ముడిని తాతా! స్వంత బలగం వల్లగానీ, ఇతరుల వల్ల గానీ రాజ్యం కూలిపోయి అగచాట్లు పడే రాజు తన బాధను ఎలా దిగమ్రింగుకోవాలో చెప్పమని అడుగుతాడు. దానికి సమాధానంగా భీష్ముడు కాలకవృక్షీయుడనే మహాముని క్షేమదర్శికి చెప్పిన కథను చెపుతాడు.
రాజా! సంపద శాశ్వతంగా ఉండిపోదు. సంపద నాకు అనుభవ సామాగ్రియే కాని సంపదకు నేను బానిసనుకానని నిశ్చియంగా భావించే నాయకునకు చీకుచింతా ఉండదు. కాదనుకున్న పని ఒకనికి వెంటనే సాకారం కావచ్చు.. తప్పక సాధించగలమని భావించిన ఒక పని మరొకనికి అపజయాన్ని కూర్చవచ్చు. ఫలిస్తే సంతోషాన్ని.. అపజయం దు:ఖాన్ని కలిగిస్తుంది. మంచిచెడ్డా తెలిసినవాడు రెంటినీ సమంగా దర్శించగ లుగుతాడు. మరణం సమీపించిన సమయంలో తల్లిదండ్రులను, భార్యాపిల్లలనే కాపాడుకోలేని వ్యక్తి ధనాన్ని ఎలా కాపాడుకోగలుగుతాడు? అశాశ్వతమైన వాటి గూర్చి వగచి ఫలితం లేదు. అలాగే జరిగిపోయిన దానిని గూర్చి విచారించినా.. జరగని దానిని ఆశించినా ఫలితం శూన్యం. కాబట్టి కర్తవ్య నిర్వహణలో శ్రద్ధతో ప్రయత్నించిన వానికి విజయం దక్కినా, దక్కకున్నా విచారం పోతుంది.
జన్మించిన ప్రతివ్యక్తీ శక్తియుక్తులు సమర్ధత కలిగినవాడే. అంతరంగంలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి వినియోగించుకున్న వారే విజయసాధకులౌతారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సంపద పోవచ్చు.. దానికి విచారించకుండా తిరిగి ప్రయత్నించడం వల్ల విజయం లభించవచ్చు. కాని నిరాశా నిస్పృహలతో విచారిస్తూ కూర్చుంటే దు:ఖమే మిగులుతుంది. ఎలాగైతే పెద్ద మడుగులో నీళ్ళు కలకబారినా కొంత సమయం పిమ్మట తేటపడతాయో అలాగే గుండె దిటవుగలవాడు తనకు జరిగిన అనర్థాలకు, అవమానాలకు చలించకుండా సహనం పాటిస్తే తెప్పరిల్లగలుగుతాడు.. అంటూ క్షేమదర్శిని ఓదార్చడం కనిపిస్తుంది. మహాభారతంలో ప్రయత్నంలో జయాపజయాలు సాపేక్షాలు పొంగిపోయినా, క్రుంగిపోయినా వ్యక్తి పాతాళానికి చేరుకుంటాడు. కాబట్టి కర్తవ్యాన్ని ఉపాసిస్తూ.. నిరీహులై ప్రయత్నించే వారికి శుభం కలుగుతుంది.. అని అన్నాడు భీష్ముడు.

  • పాలకుర్తి రామమూర్తి

Leave a Reply