ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారత్- పాక్ సరిహద్దు సమీపంలో ఓ పావురం కలకలం రేపింది. మందుపాతరను పేల్చేస్తామంటూ దాని కాలుకి బెదిరింపు సందేశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జమ్మూ (Jammu)లోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్ఎస్ పురాలోని ఖాట్మారియన్ ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం అధికారులు ఓ పావురాన్ని పట్టుకున్నారు.
దాని కాలుకి ఉర్దూ, ఆంగ్లంలో ఓ సందేశం ఉంది. ‘కశ్మీర్ మాది. సమయం వచ్చింది. అది వస్తుంది’ అని ఉర్దూలో, ‘జమ్మూస్టేషన్ ఈఐడీ బ్లాస్ట్’ అని ఆంగ్లంలో రాసి ఉంది. దీంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) పోలీసులకు దీనిపై సమాచారం ఇచ్చారు. వెంటనే జమ్మూ రైల్వేస్టేషన్ సహా పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక, ఈ పావురం ఇక్కడికి ఎలా వచ్చిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.