వేల్పూర్, ఏప్రిల్ 5 (ఆంధ్రప్రభ ) : అణగారిన వర్గాల గొంతుక జగ్జీవన్ రామ్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల కార్యక్రమంలో వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల నేత, దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, దేశ మాజీ ఉప ప్రధాని ‘బాబూజీ’ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వేముల ఆ మహనీయునికి ఘనమైన నివాళులర్పించారు.
అంబెడ్కర్ బడుగు, బలహీన వర్గాల కోసం రాజ్యాంగం రచిస్తే, ఆ రాజ్యాంగ ఫలాలు అందడానికి అవి అమలయ్యే విధంగా కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. తన జీవిత కాలం మొత్తం అణగారిన వర్గాల కోసం కృషి చేశారన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం అన్ని వర్గాలు ఏకమై పాటుపడాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మాదిగ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.