వెలగపూడి : మీ చుట్టూ ఉంటే వారి మాటలు విని తప్పుదోవ పట్టకూడదని తాను వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ ను కోరినట్టుగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. కాకినాడ పోర్టు అంశానికి సంబంధించి నమోదైన కేసులో సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి బుధవారం హాజరయ్యారు. విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కోటరీకి అనుకూలంగా ఉన్న వారినే జగన్ వద్దకు తీసుకెళ్తారని ఆయన విమర్శించారు. మీ మనసులో తనకు స్థానం లేదని.. అందుకే తాను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని విజయసాయిరెడ్డి చెప్పారు.
పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో తన మనసు విరిగిపోయిందని ఆయన అన్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నానని తాను జగన్ కు చెప్పానన్నారు. ఆ సమయంలో ఆయన లండన్ లో ఉన్నారన్నారు. కానీ, తనను పార్టీలో ఉండాలని జగన్ తనను కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను పార్టీ మారిన సమయంలో తనపై జగన్ చేసిన విమర్శలపై కూడా ఆయన కౌంటరిచ్చారు. ప్రలోభాలకు తాను లొంగలేదని, విశ్వసనీయతను కోల్పోలేదన్నారు. ఎవరి బెదిరింపులకు కూడా తాను భయపడలేదని ఆయన స్పష్టం చేశారు. జగన్ తో అప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పుడు అలానే ఉన్నానని ఆయన వివరించారు. జగన్ లోనే మార్పు వచ్చిందని ఆయన చెప్పారు.
కోటరీ నుంచి ఎప్పుడు జగన్ బయటపడతాడో అప్పుడే అతనికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు. వైఎస్ఆర్సీపీలోకి తాను తిరిగి వచ్చే అవకాశమే లేదన్నారు. రాజకీయాలకు వచ్చే అవకాశమే లేదన్నారు. తాను వ్యవసాయం చేసుకుంటానని ఆయన అన్నారు. కాకినాడ పోర్టు అంశంలో జగన్ కు సంబంధం లేదని తాను విచారణలో చెప్పానన్నారు. ఈ విషయంలో విక్రాంత్ రెడ్డికి సంబంధం ఉందన్నారు. కేవీ రావు ఎవరో కూడా తనకు తెలియదని ఆయన అన్నారు. వైవీ సుబ్బారెడ్డి అమెరికా వెళ్తే కేవీ రావు ఇంట్లోనే ఉండేవారని ఆయన ఆరోపించారు.