పాకిస్థాన్ : పాకిస్థాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న బోలన్ జిల్లాలో ఉగ్రవాదులు జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ తో రంగంలోకి దిగిన భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్లో.. సుమారు 27మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 155మంది ప్రయాణికులను ప్రస్తుతం రెస్క్యూ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 9 బోగీలతో వెళ్తున్న రైలులో దాదాపు 450మందికిపై గా ప్రయాణికులున్నారు. క్వెట్టా నుంచి పెషావర్కు రైలు వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు అటాక్ చేశారు.
ఇవాళ ఉదయం జాఫర్ రైలు నుంచి 57మంది ప్రయాణికుల్ని రెస్క్యూ చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు. వాళ్లను క్వెట్టాకు తరలించారు. ఇక మరో 23 మంది ప్రయాణికుల్ని మాచ్కు పంపించారు. రెస్క్యూ చేసిన వారిలో 58మంది పురుషులు, 31మంది మహిళలు, 15మంది చిన్నారులున్నారు. బంధీలుగా ఉన్న ప్రయాణికుల్ని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి. భద్రతా దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాక, మిలిటెంట్లు చిన్న గ్రూపులుగా విడిపోయారని అధికారులు తెలిపారు. గాయపడ్డ 17మంది ప్రయాణికుల్ని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు.
జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును ఆపేందుకు మిలిటెంట్లు ట్రాక్ను పేల్చినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తులు శాటిలైట్ ఫోన్లతో అంతర్జాతీయ కాల్స్ మాట్లాడుతున్నట్లు గుర్తించారు. కొండలు, లోయ ప్రాంతాలు కావడంతో.. రైలు హైజాక్ అయిన ప్రాంతానికి వెళ్లడానికి భద్రతా దళాలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మాస్టర్మైండ్తో రైలు హైజాక్ నిందితులు టచ్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎక్కువ శాతం మహిళలు, చిన్నారుల్ని బంధీలుగా వాడుకుని బెదిరిస్తున్నట్లు చెప్పారు. రైలులో సాధారణ ప్రయాణికులు ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపారు.
బాంబులతో రైల్వే ట్రాక్ను పేల్చిన తర్వాత.. ఇంజిన్ డ్రైవర్పై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. అయితే మస్కఫ్ టన్నెల్కు సమీపంలో రైలు ఆగిపోయినట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బోర్డర్ సమీపంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో రైలును ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. పంజాబ్, సింధ్ ప్రాంతాల నుంచి బలోచిస్తాన్ వెళ్లే అన్ని రైళ్లను రెస్క్యూ ఆపరేషన్ వల్ల రద్దు చేసినట్లు పాకిస్థాన్ రైల్వే శాఖ పేర్కొంది.