టెల్అవీవ్ – ఇజ్రాయెల్ కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించారు.. ఈమేరకు పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.అధికార లేబర్ పార్టీకి చెందిన యువాన్ యాంగ్ ఎర్లీ, వుడ్డీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అబ్తిసామ్ మొహమ్మద్ షెఫీల్డ్ సెంట్రల్కు ఎంపీగా ఉన్నారు. వీరు శనివారం లుటాన్ నుంచి ఇజ్రాయెల్కు వెళ్లారు. వారిని అధికారులు అడ్డుకుని నిర్బంధించారు.
అనంతరం కొంత సమయం తర్వాత విడిచిపెట్టారు. తమ భద్రతా దళాల కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయడంతో పాటు తమపై వ్యతిరేకతను పెంచేందుకు ఆ ఎంపీలు వచ్చారని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే వారి రాకను అడ్డుకున్నట్లు తెలిపారు.
టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తీవ్రంగా పరిగణించారు.. ‘ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన యూకే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలోని ఇద్దరు ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వారి చర్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మా ఎంపీలతో వారు ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. ఇదే విషయాన్ని అక్కడి ప్రభుత్వంలోని నా సహచరులకు స్పష్టం చేశా. ఇజ్రాయెల్ – హమాస్ల మధ్య కాల్పుల విరమణ, గాజాలో శాంతి నెలకొల్పడం వంటి అంశాలకు సంబంధించిన చర్చలపైనే మా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది’ అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
.