జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి భారతదేశం – పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసింది. తాజాగా, పాకిస్తాన్ సైన్యం ఒక భారత సైనికుడిని బందీగా తీసుకున్న ఘటన కలకలం రేపుతోంది.
భారత జవాన్ సరిహద్దు వద్ద తమ భూభాగంలోకి ప్రవేశించాడని ఆరోపిస్తూ… పాకిస్తాన్ సైన్యం ఒక బిఎస్ఎఫ్ జవాన్ను అరెస్టు చేసింది. అయితే, తమ సైనికుడిని అక్రమంగా అరెస్టు చేసినందుకు పాకిస్తాన్పై భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) దాటిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) 182వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ పికె సింగ్ను పాకిస్తాన్ రేంజర్లు అరెస్టు చేసినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
సర్వీస్ రైఫిల్ పట్టుకుని యూనిఫాంలో ఉన్న సింగ్.. రైతులతో కలిసి నడుస్తూ నీడలో విశ్రాంతి తీసుకోవడానికి ముందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాడు.
అదే సమయంలో, పాకిస్తాన్ సైనికులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జవానును పట్టుకోవడంపై భారత్, పాకిస్తాన్ రేంజర్లు చర్చలు ప్రారంభించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఆ సైనికుడిని విడుదల చేయడానికి ఒక ఫ్లాగ్ మీటింగ్ ప్రారంభించారు.
ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. జవాన్ త్వరగా, సురక్షితంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.