IND vs ENG | ఓవల్‌లో తుది పోరు.. భార‌త్ కు గెలుపు త‌ప్ప‌నిసరి !!

లండన్‌లోని ప్రతిష్టాత్మక ఓవల్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు నేడు (గురువారం) ప్రారంభం కానుంది. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టును ఇంగ్లండ్ గెలిచినా, రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. మూడో మ్యాచ్ మళ్లీ ఇంగ్లండ్ వశమవగా, నాలుగో టెస్టులో భారత్ పోరాడి ఓడిపోయే మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఇప్పుడు ఐదో టెస్టు తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది.

ఈ సిరీస్ స‌మం చేయాలంటే ఈ ఆఖ‌రి పోరులో భారత్ గెల‌వ‌గ‌డం త‌ప్ప‌నిస‌రి పరిస్థితి. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఈ టెస్టును గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగింది. భారత్‌కు ఇది ఒక సవాలుతో కూడిన మ్యాచ్. విజయమైతే సిరీస్ సమం చేయొచ్చు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కూడా సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతోనే ఓవల్‌లో బరిలో దిగుతోంది.

భారత్‌కు షాక్..

ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టెస్టుకు దూరం కావాల్సి వచ్చింది. అతడిపై పని భారం తగ్గించేందుకు బీసీసీఐ ముందుగానే నిర్ణయం తీసుకుంది. బుమ్రా స్థానంలో అర్శ్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. గత టెస్టుకు గాయంతో అందుబాటులో లేని అర్శ్‌దీప్ పూర్తిగా కోలుకున్నాడు. మరోవైపు ఆకాశ్ దీప్ కూడా జట్టులోకి రానున్నట్లు సమాచారం. ఎడ్జ్‌బాస్టన్‌లో చారిత్రక విజయానికి అతడు కీలకంగా నిలిచాడు.

ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్ దళానికి బలం చేకూర్చేందుకు బెంచ్‌కే పరిమితమైన కుల్దీప్ యాదవ్‌కు ఈ టెస్టులో అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పిన్ విభాగంలో భారత జట్టు బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడటంతో అతడి స్థానంలో ధ్రువ్ జురేల్ బరిలో దిగాడు.

ఇంగ్లండ్‌కు గాయాల బెడద..

ఇంగ్లండ్ జట్టుకు కూడా గాయాలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. సారథి బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. ఇప్పటి వరకు 17 వికెట్లు, 304 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసిన స్టోక్స్ గైర్హాజరీ ఇంగ్లండ్‌కు పెద్ద లోటు. అతడి స్థానంలో ఓలీ పోప్ జట్టు నాయకత్వం చేపట్టాడు. అలాగే జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ కూడా గాయాల వల్ల చివరి టెస్టుకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో బెథెల్, అట్కిన్సన్, ఒవర్టన్, జోష్ టంగ్ జట్టులోకి వచ్చారు.

ఓవల్ మైదానంలో ఇంగ్లండ్ రికార్డు !

ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌కు రికార్డు బలంగా ఉంది. ఇక్కడ ఇరు జట్లు ఇప్పటి వరకు 14 టెస్టులు ఆడగా, ఇంగ్లండ్ 5 టెస్టులు గెలిచింది. భారత్ కేవలం రెండు విజయాలు సాధించగా, ఏడింటి మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. పిచ్ స్వభావం మొదటి మూడు రోజులు పేసర్లకు అనుకూలంగా ఉంటుందని, చివరి రెండు రోజులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే వర్షం ఛాంసులు కూడా ఉండటంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయి.

తుది జట్ల వివరాలు
భారత్‌ (అంచనా): యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), ధ్రువ్‌ జురేల్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దిప్‌ యాదవ్‌, ఆకాశ్‌ దీప్‌, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

ఇంగ్లండ్‌: జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌ (కెప్టెన్‌), జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, జాకబ్‌ బెథెల్‌, జేమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), క్రిస్‌ వోక్స్‌, గస్‌ అట్కిన్సన్‌, జేమీ ఒవర్టన్‌, జోష్‌ టంగ్.

ఈ మ్యాచ్‌ను మధ్యాహ్నం 3:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్, జియో సినిమా వేదికలపై ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. భారత అభిమానులు సిరీస్‌ను సమం చేస్తారా లేదా అనే ఉత్కంఠలో ఉన్నారు.

Leave a Reply