వారి ఆశ‌యాల‌కు అనుగుణంగా…

వారి ఆశ‌యాల‌కు అనుగుణంగా…

నల్గొండ, ఆంధ్ర ప్రభ : భారత స్వాతంత్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు, దేశ విద్యారంగ పురోభివృద్ధికి కృషిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) పిలుపునిచ్చారు. భారత దేశ మొదటి విద్యా శాఖ మంత్రి, మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్(Abul Kalam Azad) దేశ విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, ఆయన సమయంలోనే ఐఐటి వంటి అత్యున్నత విద్యా సంస్థలను స్థాపించడం జరిగిందని తెలిపారు.

అంతేకాక ఆయన భారతరత్న గ్రహీత అని, సకల భాషా కోవిదుడని, అరబిక్, ఇంగ్లీష్ ,ఉర్దూ, హిందీ, పర్షియా, బెంగాలీ వంటి భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించారని తెలిపారు. అందరితో సౌమ్యంగా మాట్లాడుతూ.. మృదుస్వభావిగా పేరుపొందారని, మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. వారి ఆశయాల కనుగుణంగా, వారి స్ఫూర్తితో జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్(Revenue Additional Collector J. Srinivas), ఇంచార్జ్ డీఆర్ ఓ వై.అశోక్ రెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్ రెడ్డి, డీఈ ఓ భిక్షపతి, కలెక్టర్ కార్యాలయ ఏ ఓ మోతీలాల్, మైనారిటీ పెద్దలు డాక్టర్ ఎం ఏ ఖాన్, సయ్యద్ హసన్, ఎం డి సలీం, ఎం ఏ రఫీ, ఉమర్ షరీఫ్, సయ్యద్ జాఫర్, బాబాజియఉద్దీన్, మసిఉద్దీన్, అహ్మద్ ఖలీమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply