HYDRAA | నాలాల్లో వరద సాఫీగా సాగాలి : ఏవి రంగనాథ్‌

వర్షాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరద ముంచెత్తుతోందని నాలాల నుంచి వరద నీరు సాఫీగా సాగడంలేదన్నారు. తేలిక పాటి వర్షాలకే పరిస్థితి ఇలా ఉంటే.. కుండ పోత వర్షాలకు నానా అవస్థలు పడాల్సి ఉంటుందని వివరించారు.

ఈ సమస్యపై ఇరిగేషన్‌, జీహెచ్‌ ఎంసీ, మున్సిపల్‌ శాఖలలో నాలాల విభాగానికి చెందిన ఇంజినీరింగ్‌ అధికారులతో హైడ్రా కార్యాలయంలో శనివారం చర్చించారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు, రహదారులు మునిగిపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని కమిషనర్‌ గుర్తు చేశారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

నాలాల సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.నాలాలు కుంచించుకుపోవడం.. మధ్యలో ఆటంకాలు ఏర్పడినా, ఆక్రమణలకు పాల్పడినా ఆ వివరాలివ్వాలని కోరారు.

నాలాల కబ్జాలపై..ప్రజావాణిలో ఫిర్యాదులు చేయండి..

నాలాల ఆక్రమణలు, ఇబ్బందులపై ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ సూచించారు. జూన్‌ నెలతో పాటు.. అవసరమైతే జులై నెలలో కూడా నాలాల సమస్యలపైనే ఫిర్యాదులు స్వీకరించి.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ఓఆర్‌ ఆర్‌ పరిధిలో నాలాల కబ్జాలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా.. తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. నాలా ఆక్రమణకు గురైనట్టు రుజువు చేసే చిత్రాలు పాతవి, ప్రస్తుతానివి కూడా తీసుకువచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు.

పార్కును కాపాడిన హైడ్రా..

మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీలోని గ్రామపంచాయతీ ప్రాంతంలో ఓ పార్కును కబ్జాల చెర నుంచి హైడ్రా కాపాడింది. దాదాపు 2 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కును ఆ పక్కనే స్థలం ఉన్న వ్యక్తి కబ్జా చేశారంటూ నార్త్‌ పార్కు అవెన్యూ వెంచర్‌ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా ఈ మేరకు చర్యలు తీసుకుంది.

97, 108, 109 సర్వే నంబర్లలోని మూడున్నర ఎకరాలలో 10 ప్లాట్లతో 1997లో నార్త్‌ పార్క్‌ అవెన్యూ వెంచర్‌ను వేశారు. ఇందులో 2 వేల గజాల మేర పార్కుకు కేటాయించారు. ఈ పార్కు 27 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఆ పార్కు స్థలం తనదంటూ.. గతంలో ఉన్న ఈత కొలనుతో పాటు.. పార్కు ప్రహరీని కబ్జాదారుడు కూల్చేశాడని నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

అప్పటి లే ఔట్‌ ప్రకారం.. అది పార్కు స్థలమే అని స్థానిక మున్సిపల్‌ అధికారులతో నిర్ధారించుకున్నాక హైడ్రా ఆక్రమణలను తొలగించింది. అందులో నిర్మించిన షెడ్డుతో పాటు.. చుట్టూ కబ్జాదారుడు ఏర్పాటు చేసిన ప్రహరీని కూడా తొలగించింది. పార్కు స్థలం లభించడంతో ప్లాట్‌ ఓనర్లు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *