న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :భారతదేశంపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి హింసకు పాల్పడటమే కాకుండా ఇప్పుడు అణ్యాయుధాలతో దాడి చేస్తామని పాకిస్తాన్ బహిరంగంగానే బెదిరిస్తోంది. ఇటీవల పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసి భారత్పై వేయడానికి పాక్ వద్ద 130 అణుబాంబులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రష్యాలోని పాకిస్థాన్ రాయబారి ముహమ్మద్ ఖాలిద్ జమాలి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
పాక్పై భారత్ దాడిచేస్తే చూస్తూ ఊరుకోమని.. అణ్వాయుధాలతో ప్రతిదాడి చేస్తామని హెచ్చరించాడు. రష్యాలో మీడియాతో అవాకులు..రష్యా రాజధాని మాస్కోలో రష్యన్ మీడియాలో పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్త ముహమ్మద్ ఖాలిద్ జమాలీ మాట్లాడారు. పాకిస్థాన్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తమకు విశ్వసనీయ నిఘావర్గాల సమాచారం ఉందన్నారు. పాక్లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని భారత్ నిర్ణయించిందని.. త్వరలోనే ఈ దాడులు జరిగే అవకాశాలున్నాయని జమాలీ పేర్కొన్నారు. ఇదే జరిగితే భారత్పై అణుబాంబులతో దాడి చేయడానికి పాక్ సిద్దంగా ఉందని జమాలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దాడి చేయడం ఖాయమే..
కాగా, రష్యాలోని పాక్ రాయబారి మాటలను బట్టి పాకిస్తాన్పై భారత్ ఎప్పుడు దాడిచేస్తుందో అన్న భయంతో ఉందని స్పష్టమవుతోంది. అందుకే ముందుగానే అణ్వాయుధాలని భారత్ను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.
కానీ, భారత్ మాత్రం చాలా స్పష్టంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లో పహల్గాం ఉగ్రదాడికి కారణమైన పాక్ను వదిలిపెట్టబోదని తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్కు సింధుజలాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ దేశంతో పూర్తిగా వాణిజ్య సంబంధాలు తెంచుకుంది. అక్కడి విమానాలకు భారత గగనతలంలో అనుమతించడంలేదు. జల రవాణకు సంబంధించి కూడా దారులన్నీ మూసేసింది. పాక్ను అన్ని విధాలా దెబ్బతీసేందుకు చర్యలు తీసుకున్న భారత్.. ప్రత్యక్ష దాడికి కూడా దిగుతుందని ప్రచారం జరుగుతోంది.