Hospital | రూ.15 కోట్లతో 50 పడకల ఆసుపత్రి

Hospital | రూ.15 కోట్లతో 50 పడకల ఆసుపత్రి
- పాలనాపరమైన అనుమతులు మంజూరు
- ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కృషి
- రూ.15 కోట్లతో 50 పడకల ఆసుపత్రి
- రూ.7.5 కోట్ల నిధులు విడుదల
- ఉత్తర తెలంగాణకు కీలకం కానున్న కరీంనగర్ ఆయుష్ ఆస్పత్రి
Hospital | పెద్దపల్లి బ్యూరో, ఆంధ్రప్రభ : ఉత్తర తెలంగాణ ప్రజలతోపాటు కరీంనగర్ ప్రజలకు ఇదో శుభవార్త. ఇప్పుడిప్పుడే ఆయుర్వేదం, యోగా నేచురోపతి, యునాని, సిద్ద, హోమియోపతి వైద్యసేవలపై రోగులు దృష్టి సారిస్తున్నారు. కొన్ని రోగాలు, వ్యాధులకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదం, హోమియోపతి మందులు ఉంటున్నాయని పలువురు భావిస్తూ ఆయా వైద్య సేవల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
కరీంనగర్ లో 50 పడకల ‘ఆయుష్’ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘ఆయుష్’ ఆసుపత్రి ఏర్పాటు కోసం కృషి చేశారు. ఆయన కృషి ఫలించింది.
Hospital | రూ.7.5 కోట్లు విడుదల
కరీంనగర్ ఆయుష్ ఆసుప్రతి ఏర్పాటుకు రూ.15 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అందులో భాగంగా రూ.7.5 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తక్షణమే ‘ఆయుష్’ ఏర్పాటు కోసం తగిన స్థలాన్ని ఎంపిక చేసి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. స్థల ఎంపిక ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుతోపాటు డాక్టర్లు, సిబ్బందిని నియామక బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్రం ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆయుష్ అధికారులతో చర్చించారు. స్థల సేకరణపై దృష్టి సారించారు.

Hospital | సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతీయ సంప్రదాయ వైద్య చికిత్సలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా యోగా, ఆయుర్వేదం, హోమియోపతి వైద్యంపట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఈ చికిత్సలవల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో ప్రజలు సైతం వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఆయుర్వేదం, హోమియోపతి, యోగా, నేచురోపతి ఆసుపత్రులకు తండోపతండాలుగా రోగులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు సైతం తమ ప్రాంతంలో ఆయుష్ ఆసుపత్రి ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంలో పలుమార్లు ప్రజలు ‘ఆయుష్’ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాలు అందించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆయుష్ ఆసుపత్రి కోసం కృషి చేశారు.

Hospital | 50 పడకల ఆస్పత్రిలో సేవలు
- ఆయుర్వేద, హోమియోపతి, యోగా నేచురోపతి, యునాని, సిద్ద వైద్య చికిత్స సేవలన్నీ అందుబాటులోకి రానున్నాయి.
- ప్రసూతి, స్ర్తీ రోగ చికిత్సలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
- కాయకల్ప చికిత్స, పంచకర్మ,శల్య, శాలాక్య వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి.
- కాయచికిత్సకు 20, పంచకర్మ చికిత్సకు 10, శల్య సేవలకు 10, ఈఎన్టీ, ప్రసూతి, స్ట్రీ ఆరోగ్య సేవలకు 5 పడకలను కేటాయిస్తారు.
- ప్రతి ఆస్పత్రికి మెడికల్ సూపరింటెండెంట్ తోపాటు ఇద్దరు డిప్యూటీ/అసిస్టెంట్ డైరెక్టర్స్ (అడ్మిన్, ఫైనాన్స్) , ఇద్దరు హెడ్ క్లర్క్స్, ఇద్దరు యూడీసీలు, ఏడుగురు ఎల్డీసీలు, 14 మంది నర్సింగ్ స్టాఫ్, ఇద్దరు నర్సులతోపాటు ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఫార్మాసిస్టులు సేవలందిస్తారు.
- పంచకర్మ చికిత్సలకు ప్రత్యేక సిబ్బంది అందుబాటులో ఉంటారు.
- ఆయుష్ ఆసుపత్రిలో హౌస్కీపింగ్, లాండ్రీ, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, గార్డెనర్ తోపాటు 21 మంది సెక్యూరిటీ సిబ్బంది కూడా సేవలు అందిస్తారు.
- ఆయుర్వేదం విషయానికొస్తే పంచకర్మ చికిత్సలు (వమన, విరేచన, బస్తి మొదలైనవి), చర్మ, జాయింట్, జీర్ణక్రియ, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలు అందుబాటులోకి వస్తాయి.
- యోగా, నేచురోపతి విభాగం విషయానికొస్తే… యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి సేవలతోపాటు జీవనశైలి మార్పులు, స్ట్రెస్, షుగర్, బీపీ నియంత్రణకు సంబంధించి పై కౌన్సిలింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
- హోమియోపతి విభాగానికి సంబంధించి హోమియోపతి డాక్టర్లు, పిల్లలు, మహిళలు, అలర్జీ, ఆస్తమా, మైగ్రేన్ చికిత్సలు అందుబాటులోకి వస్తాయి.
- డిమాండ్ ను బట్టి సిద్ద, యునానీ సేవలు కూడా ప్రారంభిస్తారు.
- రోజువారీ వైద్య సేవలు (ఓపీ), డైట్ న్యూట్రిషన్ సలహాలు, ఆరోగ్య అవగాహన శిబిరాలు కూడడా అందుబాటులోకి రానున్నాయి.
- దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ పరిష్కార సేవలు ఆయుష్ ఆసుపత్రి ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
