హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుక్కల దాడిలో ఓ జింక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆ రక్తపు మరకలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతికే అంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. అత్యాశతో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వం జింకలకు నెలవైన కంచ గచ్చిబౌలి భూములను ధ్వంసం చేసింది. దీంతో ఆ ప్రాంతంలో కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తూ జింకను చంపాయి. కంచ గచ్చిబౌలి మినీ ఫారెస్ట్ను రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా ధ్వంసం చేయడం వల్ల విలువైన వృక్ష, జంతుజాలం నష్టపోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు. వన్యప్రాణుల ఈ దారుణ హత్యపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
కంచ గచ్చిబౌలిలో 100 ఎకరాల్లో చెట్లను నరికివేయడంతో.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు జింక వచ్చింది. జింకను చూసిన కుక్కలు మొరుగుతూ.. దానిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన జింకను హెచ్సీయూ విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది.. వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. జింకకు తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో అది చనిపోయింది.
ఇక చాలా జింకలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆ జింకలను జనాలు చేరదీసి.. వాటికి నీళ్లను అందిస్తున్నారు. మూడు రోజుల్లో 100 ఎకరాల్లో పచ్చని చెట్లను నరికివేయడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.