HCA vs SRH | హెచ్ సి ఎ బ్లాక్ మెయిల్ … విజిలెన్స్ విచార‌ణ ప్రారంభం


త‌మ‌ను టికెట్స్ కోసం వేధిస్తుంద‌న్న స‌న్ రైజ‌ర్స్
గ‌త రెండేళ్ల‌గా హైద‌రాబాద్ క్రికెట్ సంఘం వ‌త్తిళ్లు
ఫ‌స్ట్ క్లాస్ బాక్స్ కు తాళాలు వేయించిన సంఘం ప్రెసిడెంట్
ఆగ‌డాల‌పై ఎస్ ఆర్ హెచ్ బ‌హిరంగ‌ లేఖ‌
ఈ బ్లాక్ మెయిల్ ఇలాగే కొన‌సాగితే ఉప్ప‌ల్ కు బైబై
తేల్చి చెప్పిన స‌న్ రైజ‌ర్స్ యాజ‌మాన్యం
స్పందించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
విజిలెన్స్ విచార‌ణ‌కు ఆదేశం
రంగంలోకి దిగిన డిజి కొత్త‌కోట

హైద‌రాబాద్ – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మధ్య కాంప్లిమెంటరీ టిక్కెట్ల (ఉచిత పాస్‌లు) వివాదం జరుగుతోన్న విషయం తెలిసిందే. కాంప్లిమెంటరీ టిక్కెట్ల విషయంలో హెచ్‌సీఏ బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ చేస్తోందని.. ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ వీడి మరో రాష్ట్రాన్ని హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకుంటామని ఎస్‌ఆర్‌హెచ్‌ స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ని ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం కోరింది. మరోవైపు ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు.
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రావు వేధింపులు, సంఘం పాలన వ్యవహారాలు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమగ్ర నివేదిక సమర్పించాలని సోమవారం విజిలెన్స్‌ డీజీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డికి సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఈరోజు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. విజిలెన్స్ చీఫ్ శ్రీనివాస్ రెడ్డి నేతృతంలో స్టేడియంలో విచారణ ప్రారంభమైంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు, సిబ్బందిని విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌తో హెచ్‌సీఏ అధ్యక్షుడు వ్యవహరించిన తీరు, టిక్కెట్ల అమ్మకం, బ్లాక్‌లో టిక్కెట్ల విక్రయాలు, హెచ్‌సీఏ రోజువారీ పరిపాలన వ్యవహారాలపై విజిలెన్స్‌ శాఖ ఆరా తీసుస్తున్నారు. అలాగే స‌న్ రైజ‌ర్స్ ప్ర‌తినిధుల‌తోనూ విజిలెన్స్ అధికారులు మాట్లాడ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *