Harish Rao | సీఎం కు హరిష్ రావు లేఖ
- నాలుగు నెలలైనా… అందని పరిహారం..
- హరీష్రావు ఆగ్రహం
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదానికి నాలుగు నెలలు పూర్తయినా, బాధితుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని, ప్రభుత్వ సహాయం అందలేదని మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రమాదంలో 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.
అయితే, తాజాగా హరీష్రావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి, మృతదేహాల పక్కన నిలబడి ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని హరీష్రావు ఆరోపించారు. బాధితులకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఏ దశలో ఉందో స్పష్టత లేదు. నాలుగు నెలలు పూర్తయినా కుటుంబాలకు పూర్తి పరిహారం అందలేదు. పైగా, చికిత్స ఖర్చుల పేరిట పరిహారంలో కోత విధించడంపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
సిగాచి యాజమాన్యాన్ని ప్రభుత్వం గోప్యంగా కాపాడుతోందన్న ఆరోపణలు చేశారు. ఘటనపై ఇప్పటికీ సిట్ (SIT) ఏర్పాటు చేయకపోవడం, బాధ్యులపై అరెస్టులు జరగకపోవడం ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చెప్పిన మాటలకే విలువ లేకుంటే బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలి? అని ప్రశ్నిస్తూ, బాధితుల పక్షాన నిలబడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, హామీలను వెంటనే అమలు చేయాలని హరీష్రావు డిమాండ్ చేశారు.

