హైదరాబాద్ – విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. . రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటం శోచనీయమని వెల్లడించారు. జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు. బకాయిలు చెల్లించకుంటే జులై 1 నుంచి అన్ని రకాల ఆహార పదార్థాలు, ఇతర సామాగ్రి సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్విట్ చేశారు…
మరోవైపు 13 నెలలుగా రూ.450 కోట్లకుపైగా అద్దె బకాయిలు చెల్లించక భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దుస్థితి నెలకొన్నదని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటికీ యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, స్కూల్ బ్యాగులు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో యూనిఫామ్ ఇవ్వకపోవడంతో పిల్లలు పాత, చినిగిపోయిన దుస్తులు వేసుకుంటున్నారని తెలిపారు. పదేండ్లలో అద్భుతంగా నడిచిన గురుకులాల వ్యవస్థ, రేవంత్ పాలనలో కుదేలవుతుండటం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు, రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమని అన్నారు.