Guntur Mirchi Yard | వైసీపీ నేత చేతివాటం.. మిర్చీ బస్తాలు మాయం
గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల 14 మిర్చి టిక్కీలు మాయమయ్యాయి. మిర్చి యార్డ్కు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చిన సమయంలో మిర్చి బస్తాలు మెట్టు కట్టిన చోట తోపులాట జరిగింది. భయంతో రైతులు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. కాసేపటికి తమ బస్తాల వద్దకు వచ్చి చూసుకున్న రైతులకు షాక్ తగిలింది. ఇద్దరు రైతులకు చెందిన 14 మిర్చి టిక్కీలు మాయమయ్యాయి. మిర్చి టిక్కీలు మాయమవడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. గుంటూరు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు సానుగంటి చైతన్య మిర్చి టిక్కీలు దొంగిలించినట్లు యార్డ్ అధికారులు గుర్తించారు.
ఇసుజు ట్రక్కులో మిర్చి టిక్కీలు చైతన్య తీసుకెళ్తున్నట్లు యార్డ్ సీసీ పుటేజీలలో కనబడింది. రెండు రోజుల కిందట సరుకు అమ్ముకోవడానికి గుంటూరు మిర్చి యార్డ్కు పల్నాడు జిల్లా వెల్దుర్దికి చెందిన నారాయణ, వెంకట సుబ్బయ్య అనే రైతులు వచ్చారు. నారాయణ, వెంకట సుబ్బయ్యకు చెందిన 14మిర్చి టిక్కీలను చైతన్య ఎత్తుకెళ్లాడు. యార్డ్ అధికారులు విషయాన్ని పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చైతన్య కోసం గాలిస్తున్నారు.