మొండి బకాయిదారులపై పోలీస్ శాఖ కేసులు..

మొండి బకాయిదారులపై పోలీస్ శాఖ కేసులు..
జీఎస్టీ మొండి బకాయిలు వసూలుకు సహకారం అందించాలి
గుంటూరు, ఆంధ్రప్రభ : జిల్లాలో జీఎస్టీ మొండి బకాయిలను వసూలు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ కు పోలీస్, రెవెన్యూ, బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధ్యక్షతన జిల్లాలో జీఎస్టీ సమర్థవంతంగా అమలుపై జీఎస్టీ (వాణిజ్య పన్నులు), రెవిన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీ, ఇంజనీరింగ్, విద్యా, పరిశ్రమలు తదితర శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జీఎస్టీ సమర్థవంతంగా వసూలు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు నిబంధనలు మేరకు మొండి బకాయిదారులపై పోలీస్ శాఖ కేసులు నమోదు చేయాలన్నారు. వాణిజ్య పన్నుల శాఖ అందించిన జీఎస్టీ డిఫాల్టర్లకు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్ల వివరాలు బ్యాంకర్లు అందించేలా ఎల్డీఎం చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు జీఎస్టీ మినహాయించి బిల్లులు చెల్లించేలా అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వృత్తి పన్ను వసూలుకు విద్యాశాఖ తో పాటు ఇతర శాఖల అధికారులు పూర్తి వివరాలు వాణిజ్య పన్నుల శాఖకు అందించాలన్నారు.
ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు డివిజన్ జాయింట్ కమిషనర్ బి గీతామాధురి, తెనాలి ఇన్చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి, జిల్లా పరిషత్ సీఈవో వి జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్, , జిల్లా విద్యాశాఖ అధికారి సలీం భాషా, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మి,, జిల్లా జీఎస్ డబ్ల్యుఎస్ అధికారి సీహెచ్ కృష్ణ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యు ఎస్, మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
