AP | పాలన కాగితాల‌కే ప‌రిమితం : దేవినేని అవినాష్

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మ‌చ్చుకైనా కానరావడం లేదని, సంక్షేమం విషయాన్ని పూర్తిగా మరిచి దోచుకోవడమే పాలకుల పాలనగా ఉందని ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గం ఇన్చార్జి దేవినేని అవినాష్ విమర్శించారు. ఇచ్చిన హామీలు.. చెప్పిన మాటలు దాటవేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా తెలిపారు. నిరుపేదల నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ విజయవాడలోని గుణ‌దల ప్రాంతంలో ఉన్న విద్యుత్ నిలయం సిఎండి కార్యాలయం ముందు మంగళవారం దేవినేని అవినాష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్య‌క్తం చేశారు. అనంతరం సీఎండీ కార్యాలయ అధికారులకు మెమరండంను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అందజేశారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాకముందు అధిక ధరలు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. రెండు మూడు వందలు వచ్చే కరెంట్ బిల్లు నేడు వేయి రూపాయలు వస్తుందనీ, ఈ బిల్లులతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రజలను మరోసారి మోసం చేశారనీ విమర్శించారు. ఇచ్చిన హామీ ప్రకారం ఛార్జీలు తగ్గించకుండా మరింతగా పెంచడం దారుణబమ‌న్నారు. సంక్షేమం, అభివృద్ధి లేకపోగా ఛార్జీల మోత మోగిస్తున్నారనీ చెప్పారు. ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలు పెంచం, ఛార్జీలు పెంచం అని బాండ్ పేపర్లు ఇచ్చారనీ, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్తారని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసిన నాయకులపై భవిష్యత్ లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తామని హెచ్చరించారు.

ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఛార్జీలు పెంచకపోయినా తమ ప్రభుత్వంపై దుష్ర్ప‌చారం చేశారనీ, ఇప్పుడు ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కూటమి నేతలు డబ్బులు దోచుకునే పనిలోనే ఉన్నారని, వంతపాడుతున్న అధికారుల తీరు కూడా ఆశ్చర్యంగా ఉందన్నారు. వారు ఏమైనా కూటమి నేతలు దగ్గర జీతాలు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. తాము వినతిపత్రాలు ఇస్తామంటే అధికారులు భయంతో వణికిపోతున్నారనీ ప్రజలకు జవాబుదారీగా పనుల రూపంలో జీతాలు తీసుకుంటున్న అధికారులు ఉండాలన్నారు. తాము వచ్చేది ప్రజా సమస్యలు మీద త‌మ ఇంటిలో సమస్యలు మీద కాదన్నారు. అధికారులు ప్రజలకు అన్యాయం చేస్తే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను వదిలేశారనీ, తడిసిన ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply