ఐపీఎల్ 2025 సీజన్లో ఆటగాళ్ల రీ ప్లేస్మెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అనుమతిచ్చింది. కానీ ఈ రీ ప్లేస్మెంట్స్కు షరతులు వర్తిస్తాయని తెలిపింది.
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ కొన్ని రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది విదేశీ ప్లేయర్లు స్వదేశాలకు వెళ్లిపోయారు. ఉద్రిక్తతలు తగ్గడంతో మే 17 నుంచి ఐపీఎల్ పున:ప్రారంభం కాబోతుంది.
అయితే కొందరు విదేశీ ఆటగాళ్లు భారత్కు తిరిగి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. తమ జాతియ జట్లకు ఆడాలి కొందరూ.. గాయాలని మరికొందరూ.. వ్యక్తిగత కారణాలతో మరికంత మంది ఐపీఎల్ మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండటంలేదు.
ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఇబ్బంది పడకుండా ఐపీఎల్ నిర్వహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే వారి స్థానంలో కొత్త వారిని జట్టులోకి తీసుకునేందుకు అనుమతిచ్చారు. అయితే, ఈ రీప్లేస్మెంట్లు తాత్కాలికమేనని, వచ్చే సీజన్కు వారిని రిటైన్ చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది.
తాత్కలికంగా ఇప్పుడు చేరే జట్లలోని ఆటగాళ్లు ఐపీఎల్ 2026 మినీ వేలం సమయంలో మళ్లీ తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
కాగా, ఈ రూల్ ప్రకారమే ఢిల్లీ క్యాపిటల్స్.. జేక్ ఫ్రెజర్ మెక్గర్క్ స్థానాన్ని బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్తో భర్తీ చేసింది. రూ.6 కోట్లకు అతన్ని తీసుకుంది.