కర్నూల్ బ్యూరో, జూన్ 7,ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి బాలిక మృతిచెందిన సంఘటన శనివారం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… చిప్పగిరి మండలం, దౌల్తాపురం గ్రామానికి చెందిన రూప (10) ఉదయం పొట్టేలును మేపేందుకు సమీపంలోని పొలాల్లోకి వెళ్ళింది. బాలిక గ్రామానికి దగ్గరలో ఉన్న నీటికుంటలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి అందులో పొరపాటున పడి మరణించినట్టు గ్రామస్థులు తెలిపారు. బాలిక తండ్రి బాలు ఆటో డ్రైవర్, తల్లి శకుంతల వ్యవసాయ కూలీ. వీరికి ముగ్గురు కూతుర్లు. పెద్ద కూతురు రూప 5వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
కోసిగి, జూన్7 (ఆంధ్రప్రభ) : మండల కేంద్రమైన కోసిగిలో రైలు గేటు దాటుతూ ప్రమాదవశాత్తు రైలు ఢీకొని దుర్మరణం చెందిన సంఘటన చోటుచేసుకుంది. కోసిగి సిద్ధప్ప పాళ్యంలో నివాసముండే జంపాపురం బసన్న (56) అనే వ్యక్తికి చెవులు సరిగా వినపడకపోవడంతో రైలు రాకను గమనించకుండా రైలు గేటు దాటుతుండగా ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు ఢీకొని మృతి చెందినట్లు ఆదోని రైల్వ్ ఆర్ పి ఎఫ్ సాయి సర్వేశ్వరావు తెలిపారు. కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.