వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కీలక నిర్ణయం…!!

  • కోర్టులో లొంగిపోవాలని నిశ్చయం…!!

పల్నాడు బ్యూరో (ఆంధ్రప్రభ) : వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మాచర్ల కోర్టులో గురువారం లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

టీడీపీ నాయకులు జె.కోటేశ్వరరావు, జె.వెంకటేశ్వర్ల హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో వీరికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను కొట్టేస్తూ ఆగస్ట్ 29న హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

నవంబర్ 28న సుప్రీంకోర్టు వీరి పిటిషన్ కొట్టవేసింది. అంతేకాకుండా రెండు వారాల్లోగా పిన్నెల్లి సోదరులను లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నట్లు సమాచారం.

పిన్నెల్లి సోదరుల పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఛార్జిషీట్లు దాఖలు కాకముందే నిందితులకు కేసు డైరీలోని విషయాలు, 161 స్టేట్‌మెంట్లు తెలియడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

నిందితుల పరపతి ఆశ్చర్యపరుస్తోందని.. వారికి పోలీసులు కూడా అండగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. పోలీసుల అండ వారికి ఉండటంతో కావాల్సిన అన్ని డాక్యుమెంట్లనూ ముందుగానే అందించారని పేర్కొంది. మరోవైపు పిన్నెల్లి సోదరులు లొంగిపోవడానికి గడువు కోరగా.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

రాష్ట్రంలో శక్తిమంతులుగా ఉన్న మిమ్మల్ని.. పోలీసులు అరెస్ట్‌ చేయరనే సంగతి మీకూ తెలుసంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటప్పుడు లొంగిపోవటానికి గడువు ఎందుకని ప్రశ్నించింది. అయితే పిటిషనర్ల తరుఫు న్యాయవాదులు కోరటంతో.. పిన్నెల్లి సోదరుల లొంగిపోయేందుకు సుప్రీంకోర్టు రెండు వారాల పాటు గడువు ఇచ్చింది.

అయితే ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గురువారం మాచర్ల కోర్టు లో లొంగిపోనున్నట్లు తెలిసింది. మరోవైపు టీడీపీ నేతలు జె.వెంకటేశ్వర్లు, జె.కోటేశ్వరరావును మే 24న హత్యకు గురయ్యారు.

ఈ ఘటన పల్నాడు జిల్లాలో సంచలనం రేపింది. ఈ జంట హత్యల కేసులో ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఏ7గా ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఉన్నారు.

Leave a Reply