హైదరాబాద్: లండన్, అమెరికా పర్యటనకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు బయల్దేరారు. అమెరికాలోని డాలస్లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలతోపాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
అలాగే లండన్లో జరిగే పలు కీలక కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. ఈ నెల 30న లండన్లో జరిగే ఇండియా వీక్ 2025లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం చేయనున్నారు. మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు ఆర్ అండ్ డీ సేవలను అందించే పీడీఎస్ఎల్నా లెడ్జ్ సెంటర్ను ప్రారంభింస్తారు. కేటీఆర్ తన పర్యటనలో వివిధ దేశాల మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులను కలవనున్నారు.
యూకేలో కార్యక్రమాలు
ముందుగా యూకేలో పర్యటించే కేటీఆర్, బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో లండన్లో జరుగనున్న ఇండియా వీక్ 2025లో ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు పాల్గొనే ఈ సమావేశంలో 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కేంద్రంగా సాగిన పాలన, ఆలోచనలు అద్భుత ఆవిష్కరణలుగా మారిన విధానంతోపాటు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కేటీఆర్ వివరిస్తారు.
మొబిలిటీ టెక్నాలజీలో తెలంగాణ ఆధారిత ఆవిష్కరణలకు సాక్ష్యంగా నిలిచిన ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ను అదే రోజు వార్విక్లో కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో అత్యాధునిక నీర్ షోర్ హార్డ్వేర్-ఇన్-లూప్ టెస్ట్ సెంటర్ ఉంది. మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీల కోసం అధునాతన ఆర్ అండ్ డీ సేవలను పీడీఎస్ఎల్ అందిస్తుంది.
యూఎస్ షెడ్యూల్ ఇలా..
అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారు. జూన్ 1న టెక్సాస్లోని ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వేలాది ఎన్ఆర్ఐలు పాల్గొంటారు.
యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్ (యూటీ డాలస్)లోని భారతీయ విద్యార్థులను జూన్ 2 న కేటీఆర్ కలుస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్పూర్తిగా నిలిచిన కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్తోపాటు భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి కేటీఆర్ మాట్లాడనున్నారు.
ఇక కెటిఆర్ తో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ కూడా పర్యటనకు వెళ్లారు.