రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న పోలీసులు..

నరసరావుపేట (ఆంధ్రప్రభ) : మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పల్నాడు జిల్లా (Palnadu district) పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు, ప్రజల ప్రాణ రక్షణ, సమాజ శ్రేయస్సు ప్రధాన ధ్యేయంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి నుండి ఉధృతమైన గాలులు, వర్షాలు, చలి పరిస్థితులను లెక్కచేయకుండా ప్రజల రక్షణ కోసం రాత్రింబగళ్లు అప్రమత్తంగా పల్నాడు జిల్లా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

ప్రమాదకర వాగులు, రహదారుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు, స్టాప్ బోర్డులు ఏర్పాటు చేసి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముమ్మర గస్తీ, పహారా చర్యలు చేపడుతున్నారు. రోడ్లపై పడిన చెట్లు, వృక్షాలను వెంటనే తొలగించి ప్రజా రవాణా, జీవన సౌకర్యాలకు అంతరాయం కలగకుండా, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.

విద్యుత్ స్తంభాలు పడిపోయిన ప్రాంతాల్లో, తెగిపోయిన తీగలు ఉన్న చోట్ల విద్యుత్ శాఖల(Electricity Departments) తో సమన్వయం చేస్తూ మరమ్మతు పనులు వేగవంతం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి, అక్కడ వారికి అవసరమైన వసతులు, ఆహారం, తాగునీరు అందేలా రెవెన్యూ శాఖలతో సమన్వయం చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, చికిత్సలు సకాలంలో అందించేందుకు వైద్య శాఖలతో కలసి చర్యలు తీసుకుంటున్నారు. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో జాతీయ రహదారుల పై భారీ వాహనాలు రాత్రి సమయాల్లో ప్రయాణించకుండా, వాటిని సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేయించే చర్యలు చేపడుతున్నారు. పల్నాడు జిల్లా పోలీసులు క్షేత్రస్థాయిలో నిరంతరం అందుబాటులో ఉంటారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అవసరమైతే తప్పా ఇళ్ల నుండి బయటకు రాకూడదని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 112 లేదా జిల్లా ఎమర్జెన్సీ పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 9440796184 ను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply