ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బస్సులు నడవాలంటే నైపుణ్యం కలిగిన డ్రైవర్ అవసరం. కానీ ఫ్యూచర్లో డ్రైవర్ల అవసరం లేకుండానే బస్సులు నడిచే రోజులు వచ్చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీతో రూపొందించిన బస్సులు అందుబాటులోకి రానున్నాయి. డ్రైవర్ లేకున్నా.. రోడ్డుపై వెళ్లేటప్పుడు అదే స్పీడ్ కంట్రోల్ చేసుకుంటుంది, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు అదే బ్రేక్స్ వేసుకుంటుంది. ఇప్పటికే ఆ బస్సులు ఐఐటీ హైదరాబాద్లో వినియోగిస్తున్నారు. పూర్తి స్థాయిలో త్వరలోనే ఎంపిక చేసిన మార్గాల్లో వినియోగించేందుకు కసరత్తు జరుగుతోంది.
ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో..
డ్రైవర్ అవసరం లేకుండా నడిచే మినీ బస్సులు ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేశాయి. అయితే ప్రజలకింకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్ పూర్తి స్థాయితో ఈ బస్సులను వినియోగిస్తోంది. ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన అటానమస్ నావిగేషన్ డేటా అక్విజిషన్ సిస్టం టెక్నాలజీని వినియోగించి ఈ డ్రైవర్ రహిత బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం మూడు రోజుల నుంచి ఇవి క్యాంపస్లో రోజువారీ సేవలు అందిస్తున్నాయి. దీంతో దేశంలోనే తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్ డ్రైవర్ రహిత బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు అని సిబ్బంది తెలిపారు.
పూర్తిగా విద్యుత్తుతో నడుస్తాయి…
ఐఐటీ హైదరాబాద్లోని ప్రత్యేక పరిశోధన విభాగం ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమనస్ నావిగేషన్’ ఈ డ్రైవర్ లెస్ బస్సులో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుక్కుంది. ఇవి పూర్తిగా విద్యుత్తుతో నడుస్తాయి. ప్రస్తుతం వర్సిటీలో రెండు రకాల బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ఒకటి సిక్స్ సీటర్, మరొకటి ఫోర్టీన్ (14) సీటర్ బస్. ఐఐటీ క్యాంపస్లోని విద్యార్థులు, అధ్యాపకులు ఈ డ్రైవరు లేని వాహనాల్లోనే మెయిన్ గేటు నుంచి వర్సిటీలోని అన్ని చోట్లకు ప్రయాణిస్తున్నారు. ఈ బస్సుల్లో ప్రయాణించిన వారి నుంచి చాలా వరకు సానుకూల స్పందన వచ్చిందని, 90 శాతం మంది బస్సు ప్రయాణంతో సంతృప్తి చెందినట్లు తెలిపారు.