ARREST| ఏటీఎం దోపిడీ కేసులో ఐదుగురు అరెస్ట్

- కుప్పం మండలంలో రూ. 5.76 కోట్ల రికవరీ
ARREST| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: బెంగళూరు పోలీసులు ఇటీవల చోటుచేసుకున్న ఏటీఎం క్యాష్ వ్యాన్ దోపిడీని ఛేదించారు. ఈ దోపిడీలో రూ.7 కోట్లకు పైగా నగదును దోచుకున్న కేసులో ఐదుగురు నిందితులను తమిళనాడులో అరెస్టు చేశారు. కుప్పం మండలంలో దోపిడీ సొత్తుకు సంబంధించి రూ. 5.76 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా బెంగళూరు పోలీసులు ఈ దోపిడీలో క్యాష్ వ్యాన్ ఇన్ఛార్జ్, ఒక పోలీస్ కానిస్టేబుల్, సీఎంఎస్ కంపెనీ మాజీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.5.76 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నవంబర్ 19న, ఆర్బిఐ అధికారులుగా నటిస్తూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ఒక ఎటీఎం క్యాష్ వ్యాన్ను ఆపి సుమారు రూ.7 కోట్లతో పారిపోయారని పోలీసులు తెలిపారు. జేపీ నగర్లోని ఒక బ్యాంకు శాఖ నుంచి సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ వాహనం నగదును రవాణా చేస్తుండగా ఈ దోపిడి జరిగింది. నిందితులు భారత ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న కారులో వచ్చి, పత్రాలను ధృవీకరించాలని చెప్పి వ్యాన్ను ఆపి, నగదుతో పాటు సిబ్బందిని బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. ఈ దోపిడీలో క్యాష్ వ్యాన్ ఇన్ఛార్జ్, ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక సి ఎం ఎస్ మాజీ ఉద్యోగి పాల్గొన్నట్లు వెల్లడించారు.
ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.5.76 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఆపరేషన్ కోసం పదకొండు బృందాలను ఏర్పాటు చేసి 200 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఈక్రమంలో 30 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించి, ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నేరస్థులను పట్టుకోవడానికి ఆరు బృందాలను అన్ని దక్షిణాది రాష్ట్రాలు, గోవాకు వరకు వెళ్లాయని వెల్లడించారు. వీరిలో వెహికల్ ఇన్ఛార్జ్, సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ మాజీ ఉద్యోగి, గోవిందపుర పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నిందితులుగా ఉన్నారని చెప్పారు. ఈ ముఠా మూడు నెలల క్రితమే దోపిడీకి ప్లాన్ చేసిందని ఆయన తెలిపారు. వారు క్యాష్ వ్యాన్ వెళ్లే మార్గాన్ని పరిశీలించి, సీసీటీవీ కెమెరాలు లేని మార్గాన్ని దోపిడికి ఎంచుకున్నట్లు వెల్లడించారు.
