రామగుండం, ఆంధ్రప్రభ : రహదారులపై వాహనాలు నిలిపి ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తే జరిమానాలు తప్పవని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… రామగుండం కమిషనరేట్ మొత్తం పారిశ్రామిక ప్రాంతంగా ఉందని, వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయన్నారు. పట్టణాల్లోని రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నిలపరాదన్నారు. రాజీవ్ రహదారిపై కూడా వాహనాలు నిలపవద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల వల్ల 1.65 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, 5 లక్షలకు పైగా క్షతగాత్రులవుతున్నారన్నారు.
రవాణా శాఖ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ కచ్చితంగా వాడాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదన్నారు. ప్రతినిత్యం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నామని, వాహన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ లు అనిల్ కుమార్, రాజేశ్వరరావు, సత్యనారాయణ లు పాల్గొన్నారు.