Basara | భూభారతి తో రైతుల సమస్యలు పరిష్కారం… కలెక్టర్

బాసర, ఏప్రిల్ 21 (ఆంధ్ర ప్రభ) : రైతులకు వారి భూములపై సమగ్ర హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూభారతి (నూతన ఆర్.ఓ.ఆర్ ) చట్టాన్ని తీసుకువచ్చిందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఆదివారం బాసర రైతు వేదికలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈసందర్బంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. భూభారతితో రైతుల భూ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. ధరణితో పరిష్కారం కాని సమస్యలకు కొత్త భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూములపై పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ప్రభుత్వం క్రమబద్ధీకరించేందుకు వీలు కల్పించిందన్నారు. భూముల హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ కోసం కొత్త చట్టం అమలులో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని, ఆ దరఖాస్తులను రెవెన్యూ డివిజన్ అధికారి, కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

అభ్యంతరాలుంటే కలెక్టర్ వద్ద అప్పీల్, ఆపై ల్యాండ్ ట్రిబ్యూనల్ అప్పీల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని వివరించారు. పురాతన అప్పీల్ వ్యవస్థలతో పోలిస్తే, ఈ కొత్త రెవెన్యూ కోర్టుల ద్వారా రైతులకు వేగవంతమైన న్యాయం లభిస్తుందని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా అందుతుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి వార్షికంగా వాటిని ప్రజల ముందు ప్రదర్శిస్తారని, ఆధార్ తరహాలో భూమికి కూడా ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈసందర్భంగా పలువురు రైతులు అడిగిన వివిధ భూ సమస్యలకు కలెక్టర్ అభిలాష అభినవ్ సమాధానమిచ్చారు. ఈ అవగాహన సదస్సులో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి రమణ, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీఓ అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుధాకర్ రావు, మాజీ సర్పంచులు రమేష్, లక్ష్మణ్ రావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

బాసర అమ్మవారి సన్నిధిలో జిల్లా కలెక్టర్ పూజలు
ఆలయంలో సౌకర్యాలను భక్తులను అడిగిన జిల్లా కలెక్టర్
బాసర, ఏప్రిల్ 21 ఆంధ్ర ప్రభ : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు ఆలయ అధికారులు అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చే ఆలయ అర్చకులు ప్రత్యేక కుంకుమార్చన పూజ జరిపించి హారతినిచ్చి ఆశీర్వదించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఆలయంలో అధికారులు కల్పించిన సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట భైంసా ఆర్ డి ఓ కోమల్ రెడ్డి, తహసీల్దార్ పవన్ చంద్ర, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *