నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 28 (ఆంధ్రప్రభ) : ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రైతుల దశాబ్దాల కల సాకారం కానుందని రైతుల కు మంచి రోజులు వచ్చాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) అన్నారు. పసుపు బోర్డు కార్యా లయం ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్య నారాయణ మాట్లాడారు.
ఇందూర్ కేంద్రంగా ఏర్పాటు చేసే పసుపు బోర్డు కార్యా లయం (Yellow Board Office) ఇందూర్ వ్యవసాయ రంగానికి కేంద్ర బిందువుగా మారనుందని అర్బన్ ఎమ్మెల్యే ధన పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లాలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టమని అర్బన్ ఎమ్మెల్యే అన్నారు. రైతు సమ్మేళన కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
పసుపు బోర్డు ఏర్పాటే కాకుండా జిల్లాలోనే జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు జిల్లాకే గర్వకారణమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (Paidi Rakesh Reddy) అన్నారు. పసుపు బోర్డు కార్యాలయ ఏర్పాటు రైతుల భవిష్యత్తుకు పునాది అన్నారు. రైతు సమ్మేళనంలో ప్రతి ఒక్క రైతు పాల్గొని జయప్రదం చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.