విజయవాడ; పహల్గామ్ ఉగ్రవాద చర్యకు దీటుగా స్పందిస్తోంది భారత ప్రభుత్వం. ఉగ్రవాదులను ఏరివేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను ఆర్మీ ధ్వంసం చేసింది. దాడికి పాల్పడిన వారిని ఎలాగైనా పట్టుకుని తీరుతామని భారత ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో ఇండియా పాకిస్థాన్ బోర్డర్లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అయితే ఇదే తరుణంలో సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేశంలోని పలు ప్రాంతాలను కేంద్రం అలర్ట్ చేసినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏపీతో పాటు తెలంగాణకు సంబంధించి 14 ప్రదేశాలను హై అలర్ట్ జోన్లుగా ప్రకటించరని, తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపినట్లు ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అత్యవసరమైతే తప్ప ఈ ప్రాంతాలను సందర్శించకుండా ఉండాలని అధికారులు సూచించారని, ఒకవేళ అనివార్యంగా వెళ్లాల్సి వస్తే అప్రమత్తంగా ఉండాలని తెలినట్లు నెట్టింట ఓ పోస్ట్ తెగ ట్రెండ్ అయ్యింది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని అధికారులు తేల్చి చెప్పారు.
సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై ఏపీ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల పేరుతో కొందరు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను హై-అలర్ట్ జోన్లుగా ప్రకటించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు.
హై అలర్ట్ జోన్ల గురించి భారత ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ ఎలాంటి ప్రకటన చేయలేదని, ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దని, తప్పుడు వార్తలు వైరల్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.