ప్రజాపాలనలో ఇతర రాష్ట్రాలకు విస్తరించిన సింగరేణి
ఒడిశాలో సింగరేణి గని ప్రారంభం.. తెలంగాణకే గర్వకారణం
13 దశాబ్దాల చరిత్రలో నైనీ గని ఒక సువర్ణాధ్యాయం
నైనీ గనిని వర్చువల్గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అధ్యాయమని, ఒడిశా లో నైనీ గని ప్రారంభంతో సింగరేణి తన విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మహాత్మా జ్యోతి రావ్ ఫూలే ప్రజా భవన్ నుంచి నేడు ఆయన ఒడిశా రాష్ట్రంలో సింగరేణి చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒడిశాలో గని ప్రారంభించడం సింగరేణి సంస్థ కే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణమన్నారు. ఈ బొగ్గు బ్లాక్ను సింగరేణి కి కేటాయించి తొమ్మిది ఏళ్లు వివిధ కారణాల రీత్యా ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు.

ప్రజాప్రభుత్వం కృషితో…
ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి, తాను కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని పలుమార్లు కలిసి పూర్తి అనుమతులకు సానుకూలత సాధించామన్నారు. ప్రజా ప్రభుత్వం చూపిన ప్రత్యేక చొరవ వల్లే ఏడాదిలోనే దీనిని ప్రారంభించుకోగలిగామన్నారు. దీంతో ప్రజా ప్రభుత్వానికి సింగరేణి అభివృద్ధిపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఒడిశాలో ప్రారంభించిన నైనీ బొగ్గు బ్లాకు సింగరేణి విస్తరణలో ఒక తొలి అడుగు గా ఆయన అభివర్ణించారు. ఇక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా సింగరేణి విస్తరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలో సింగరేణి గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నైనీ గని ప్రారంభానికి సహకరించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి, ఒడిశా ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి, స్థానిక ఎమ్మెల్యే అగస్థీ బెహరా, ఇతర ప్రజాప్రతినిధులకు తన ధన్యవాదాలు తెలిపారు.

అంగూల్ అభివృద్ధి కి పూర్తి కృషి
గత ఏడాది జులైలో తాను ఒడిశా పర్యటన సందర్భంగా అంగూల్ ప్రాంత అభివృద్ధికి ఇచ్చిన ప్రతీ హామీని త్వరలోనే సింగరేణి సంస్థ అమలు జరుపుతుందని, ఆ ప్రాంత సర్వతో ముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని భట్టి అన్నారు. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ అని, కేవలం వాణిజ్యం కోసం పనిచేసే కంపెనీ కాదని, సామాజిక స్పృహతో ఇక్కడ కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు.
అంగూల్ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపరచడం కోసం 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా నైనీ కి సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి సంబంధించిన స్థల సేకరణకు ఒడిశా ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరారు. ఇతర రాష్ట్రంలో తొలిసారిగా బొగ్గు తవ్వకం ప్రారంభించిన సింగరేణి, ఈ గనిని ఆదర్శప్రాయంగా నిర్వహించాలని కోరారు.
ఒడిశాలో బొగ్గు గని ప్రారంభించడం చరిత్రాత్మకం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ ఒడిశాలో సింగరేణి బొగ్గు గని ప్రారంభించడం ఒక చరిత్రాత్మక సందర్భమని, ఇది సింగరేణి అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే అగస్తి బెహరా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ తమ ప్రాంతంలో సింగరేణి బొగ్గు గని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ గనికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అంగూల్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కి, సింగరేణి సీఎండీకి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం, డిప్యూటీ సీఎం చొరవతో…
నైనీ నుంచి ప్రారంభోత్సవ సభకు అధ్యక్షత వహించిన సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ . బలరామ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి చూపిన ప్రత్యేక చొరవ, సహకారం వల్ల నైనీ బొగ్గు బ్లాక్ ను ఈ రోజు ప్రారంభించుకో గలిగామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ మార్గ నిర్దేశంలో థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా ప్రారంభిస్తామని, మరిన్ని అభివృద్ధి, విస్తరణ కార్యక్రమాలను విజయవంతంగా చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా భవన్ నుంచి ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఓఎస్డీ సురేందర్ రెడ్డి, సింగరేణి ఈడీ(కోల్ మూమెంట్) ఎస్డి.ఎం.సుభానీ పాల్గొనగా.. నైనీ నుంచిసంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, నైనీ జీఎం టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.