స్వేదం చిందించినా ఫలితం పొందని రైతన్న
మీడియేటర్ల బ్యాగ్లోనే మెరిసే స్వర్ణపత్రం
అవనిలో ఏపీ పొగాకుదే టాప్ లెవల్
ఇండియన్ ఎకానమీలో హైస్పీడ్ హార్స్ పవర్
భారత ఖజానాలో ₹72 వేల కోట్ల ఆదాయం
12, 600 కోట్ల విదేశీమారక ద్రవ్యానికి మూలం
రైతన్నలకు దక్కని గిట్టుబాటు, కనీస కూలీ
సిండికేట్లకు కాసులు కురిపిస్తున్న వర్జీనియా
ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో 720 లక్షల ఎకరాల్లో పొగాకు సాగు జరుగుతోంది. ఏటా 58లక్షల టన్నుల పొగాకు దిగుబడి కాగా.. ₹ 81,63,623 కోట్ల టర్నోవరుతో ఈ బిజినెస్ దూసుకుపోతోంది. ఇందులో భారతదేశం వాటా ₹12,40,205 కోట్లుగా ఉంది. 4.7 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పొగాకును ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అంతేకాకుండా భారత ప్రభుత్వానికి 2023లో ఎక్సైజ్, జీఎస్టీ, ఇతర సెస్లతో కలిపి ₹72,788 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో విదేశీ మారక ద్రవ్యం వాటా ₹12,605 కోట్లు. ఇన్ని వేల కోట్ల సంపదను సృష్టిస్తోంది రైతన్నలే. ఇంతగా లాభాలు ఆర్జించి పెడుతున్న రైతన్నలకు వార్షిక ఆదాయం ఉపాధి హామీ కూలీ రోజువారీ వేతనం కంటే చాలా తక్కువ. ఇదీ గోల్డెన్ లీఫ్ రైతన్న ల పొగసూరిన బతుకు.
జంగారెడ్డి గూడెం ప్రతినిధి, ఆంధ్రప్రభ :
దేశవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో 870 మిలియన్ కిలోల పోగాకు(tobacco ) దిగుబడి అవుతోంది. ప్రతి రైతుకు కేవలం సాగుకే ఎకరానికి ₹లక్ష ఖర్చు కాగా.. సుమారు 7 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్టు అంచనాలున్నాయి. ప్రస్తుతం వచ్చే ఆదాయం ₹1,82,000. అంటే కేవలం ₹82,000 మిగులుతుంది. నెలకు ₹6,800 ఇంటి ఖర్చులకే సరిపోతుంది. మరి ఇంట్లో పిల్లల చదువులు, అనారోగ్య సమస్యలకు అప్పు చేయాల్సిందే. ఒకరకంగా పొగాకు రైతు బతుకు ఉపాధి కూలీ కంటే హీనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఉపాధి కూలీకి రోజు వారీ వేతనం ₹307. అంటే నెలవారీ లభించే వేతనం ₹9,210. అంటే పొగాకు రైతుకు లభించే నెలవారీ ఆదాయం కంటే ఉపాధి కూలీ వేతనమే బెస్ట్. ఇక కౌలు రైతుల సంగతి పరిశీలిస్తే.. కనీసం కూలీనాలీ జనానికి పైసలు ఇవ్వలేని స్థితి. అందుకే, తమకు గిట్టుబాటు ధర కావాలని ఏపీ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతన్న అష్టకష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే, భారతదేశంలోని వాణిజ్య పంటల్లో పొగాకు ప్రముఖమైంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 4.7 కోట్ల మందికి ఉపాధిని అందిస్తోంది. దేశంలోని వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ (andhra Pradesh ), కర్నాటక (karnataka ) 99 శాతం వాటా కలిగి ఉన్నాయి.
గోల్డెన్ లీఫ్ సాగు.. నిజంగా ఓ జూదం
ఏపీలో వర్జీనియా ( Virginia ) పొగాకు సాగు రైతుల పాలిట జూదమే. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయగోదావరి, పల్నాడు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. ఒక ఏడాది లాభాలు పండితే.. మరో ఏడాది నష్టాలు (losses ) కుదేలు చేస్తాయి. లాభాల రైతుల కథలతో.. కౌలు రైతులు కూడా భారీ సంఖ్యలో బరిలోకి దిగుతారు. సిండికేటు వలలో చిక్కుకుని .. గిట్టుబాటు ధర ఏమో కానీ, కనీసం పెట్టుబడి కూడా దక్కని స్థితి నెలకొంటోంది. 2023-24లో అత్యధిక లాభాలు వస్తే.. 2024-25 లో కనీసం కూలీలకు డబ్బులివ్వలేని స్థితితో పొగాకు రైతులు బావురుమన్నారు. ఇక రాబోయే సీజన్లో అంటే 2025-26లో ఏకంగా సాగు విస్తీర్ణాన్ని పొగాకు బోర్డు కుదించేసింది.
దిగుబడి పెరిగినా లాభాల్లేవ్..
దిగుబడి పెరగటంతో మార్కెట్టులో ధర లభించటం లేదనేది పొగాకు బోర్డు వివరణ. ఆంధ్రప్రదేశ్లో 2023-24 పంట కాలంలో 43,125 మంది రైతులు 97,127 హెక్టార్లలో 39,346 బ్యారన్లలో వర్జీనియా పొగాకును సాగు చేశారు. సాగు దిగుబడి లక్ష్యం 142 మిలియన్ కిలోలు కాగా.. ₹6,313 కోట్లు విలువ చేసే 215.35 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగినట్టు పొగాకు బోర్డు సమాచారం. ఈ సీజన్లో రైతులకు సగటు కిలో వర్జీనియా పొగాకు ధర ₹288.65 పలికింది. గత ఏడాది సగటు ధర కిలోకు ₹225.73 నుంచి ₹62.62 పెరిగింది. ఈ సీజన్లో అత్యధిక ధర కిలోకు ₹411కి చేరుకుంది, గత ఏడాది కిలో ధర ₹289గా ఉంది. 76.84 మిలియన్ కిలోల అదనపు పొగాకు అమ్మకాలు జరిగాయి. 38,751 మంది రైతులు ప్రయోజనం పొందారు.