Exclusive | వాహ్​.. వర్జీనియా! గోల్డెన్ లీఫ్ తో ద‌ళారుల‌కే లాభాల పంట

దేశవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో 870 మిలియన్ కిలోల పోగాకు(tobacco ) దిగుబడి అవుతోంది. ప్రతి రైతుకు కేవలం సాగుకే ఎకరానికి ₹లక్ష ఖర్చు కాగా.. సుమారు 7 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్టు అంచనాలున్నాయి. ప్రస్తుతం వచ్చే ఆదాయం ₹1,82,000. అంటే కేవలం ₹82,000 మిగులుతుంది. నెలకు ₹6,800 ఇంటి ఖర్చులకే సరిపోతుంది. మరి ఇంట్లో పిల్లల చదువులు, అనారోగ్య సమస్యలకు అప్పు చేయాల్సిందే. ఒకరకంగా పొగాకు రైతు బతుకు ఉపాధి కూలీ కంటే హీనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఉపాధి కూలీకి రోజు వారీ వేతనం ₹307. అంటే నెలవారీ లభించే వేతనం ₹9,210. అంటే పొగాకు రైతుకు లభించే నెలవారీ ఆదాయం కంటే ఉపాధి కూలీ వేతనమే బెస్ట్. ఇక కౌలు రైతుల సంగతి పరిశీలిస్తే.. కనీసం కూలీనాలీ జనానికి పైసలు ఇవ్వలేని స్థితి. అందుకే, తమకు గిట్టుబాటు ధర కావాలని ఏపీ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతన్న అష్టకష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే, భారతదేశంలోని వాణిజ్య పంటల్లో పొగాకు ప్రముఖమైంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 4.7 కోట్ల మందికి ఉపాధిని అందిస్తోంది. దేశంలోని వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ (andhra Pradesh ), కర్నాటక (karnataka ) 99 శాతం వాటా కలిగి ఉన్నాయి.

గోల్డెన్ లీఫ్ సాగు.. నిజంగా ఓ జూదం

ఏపీలో వర్జీనియా ( Virginia ) పొగాకు సాగు రైతుల పాలిట జూదమే. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయగోదావరి, పల్నాడు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. ఒక ఏడాది లాభాలు పండితే.. మరో ఏడాది నష్టాలు (losses ) కుదేలు చేస్తాయి. లాభాల రైతుల కథలతో.. కౌలు రైతులు కూడా భారీ సంఖ్యలో బరిలోకి దిగుతారు. సిండికేటు వలలో చిక్కుకుని .. గిట్టుబాటు ధర ఏమో కానీ, కనీసం పెట్టుబడి కూడా దక్కని స్థితి నెలకొంటోంది. 2023‌‌-24లో అత్యధిక లాభాలు వస్తే.. 2024-25 లో కనీసం కూలీలకు డబ్బులివ్వలేని స్థితితో పొగాకు రైతులు బావురుమన్నారు. ఇక రాబోయే సీజన్‌లో అంటే 2025-26లో ఏకంగా సాగు విస్తీర్ణాన్ని పొగాకు బోర్డు కుదించేసింది.

దిగుబడి పెరిగినా లాభాల్లేవ్​..

దిగుబడి పెరగటంతో మార్కెట్టులో ధర లభించటం లేదనేది పొగాకు బోర్డు వివరణ. ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 పంట కాలంలో 43,125 మంది రైతులు 97,127 హెక్టార్లలో 39,346 బ్యారన్లలో వర్జీనియా పొగాకును సాగు చేశారు. సాగు దిగుబడి లక్ష్యం 142 మిలియన్ కిలోలు కాగా.. ₹6,313 కోట్లు విలువ చేసే 215.35 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగినట్టు పొగాకు బోర్డు సమాచారం. ఈ సీజన్‌లో రైతులకు సగటు కిలో వర్జీనియా పొగాకు ధర ₹288.65 పలికింది. గత ఏడాది సగటు ధర కిలోకు ₹225.73 నుంచి ₹62.62 పెరిగింది. ఈ సీజన్‌లో అత్యధిక ధర కిలోకు ₹411కి చేరుకుంది, గత ఏడాది కిలో ధర ₹289గా ఉంది. 76.84 మిలియన్ కిలోల అదనపు పొగాకు అమ్మకాలు జరిగాయి. 38,751 మంది రైతులు ప్రయోజనం పొందారు.

Leave a Reply