Exclusive : పాలిటిక్స్‌లో..కోట‌రీ! వారి మాట‌లు న‌మ్మితే మ‌ఠాష్‌

సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :అప్పట్లో రాజ్యానికి సామ్రాట్టే సర్వసైన్యాధ్యక్షుడు. యుద్ధంలో శత్రుసంహారం కోసం.. విభిన్న దళపతులను నియమిస్తాడు. వీరిలో అర్ధ రథి, రథి, మహారథి ఇట్లా వివిధ స్థాయిల్లో దళపతులు యుద్ధం చేస్తారు. సాధారణంగా అతి స్థాయి కోసం మహారాజును ప్రసన్నం చేసుకోవటానికి ఈ దళపతులు పడరాని కష్టాలు పడుతుంటారు. ఇక.. యుద్ధం ముగిసిన త‌ర్వాత చక్రవర్తులు కొలువుదీరితే ఈ దళపతులు మహారాజుకు నిత్య ప్రసన్నార్చనలో భజంత్రీలను నియమిస్తారు.

ఓహో రాజాధి రాజ.. రాజమార్తాండ .. అంటూ పొగడ్తల జడివాన‌ కురిపిస్తూ.. రాజావారి కళ్లకు గంతలు కట్టేస్తే.. రాజ్యం ఎట్లున్నా, ప్రజలు గొల్లుమని ఏడ్చినా ఈ కబురు రాజావారి చెవులకు చేరదు. ఇంకేముందీ శత్రువుల దాడిలో చివ‌రికి రాజ్యం పోయే ప‌రిస్థితులు వ‌చ్చేవి. దీనికి ప్రధాన కారణం రాజును తప్పుదోవ పట్టించి తమ పబ్బం గ‌డుపుకునే గ్యాంగే..

అదే నేటి రాజ‌కీయాల్లో కోటరీగా మారిపోయింది.ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎలాంటి కోటరీ జమానాలు నడుస్తున్నాయనే అంశంపై చర్చలు జ‌రుగుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొన్న అనేక కేసుల్లో.. ఏ2 నిందితుడు విజయసాయి రెడ్డి. వైసీపీ అధినేతకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఇటీవల తాను రాజకీయాలకు దూరమవుతున్నానని, ఒక రకంగా.. పరోక్షంగా రాజకీయ సన్యాసిగా తనను తానే ప్రకటించుకున్నారు.

ఇది సరే.. నూతన అధికార కూటమి వేటలో కేసుల ప్రహసనం ప్రారంభం కాగా, వైసీపీ అధినేత రాజకీయంగా ధ్వంసం కావటానికి కోటరీ కారణమని తాజాగా ట్వీట్‌ల మీద ట్వీట్‌లతో జగన్ రెడ్డిని నిద్రలేపే యజ్ఞం ప్రారంభించారు.

నెంబర్ 2 హితోపదేశం..

మరీ ముఖ్యంగా విభిన్న కోటరీలతో వైసీపీకి ఎంత నష్టం జరిగింద‌నే విష‌యాన్ని కొంత‌మంది బేరీజు వేసి మరీ జగన్ బాబుకు హితబోధ చేస్తున్నారు. ఇటీవల విజయ సాయిరెడ్డి పోస్టు చేసిన ట్వీట్ ప్రకారం.. జగన్ చుట్టూ మూడు రకాల కోటరీలుంటాయి. ప్రథమ శ్రేణిలో తలపండిన డబ్బున్న రాజకీయ నాయకులు, ద్వితీయ శ్రేణిలో జగన్ పేరును అడ్డం పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా నాలుగు రాళ్లు వెనకేసుకునే బ్యాచ్, తృతీయ శ్రేణిలో జగన్ పార్టీ నుంచి డబ్బులు తీసుకుంటూ.. చిన్న చిన్న పైరవీలు చేసుకుంటూ బాస్ ముందు అణిగిమణిగి నక్కవినయాలను ప్రదర్శించే సన్నజీవులు ఉంటాయని విజయ సాయి రెడ్డి విశ్లేషణ.

కాగా, ప్రథమ శ్రేణి కోటరీ జోలికి వెళ్లకుండా మిగతా రెండు వర్గాల కోటరీలపై చాలామంది విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. ద్వితీయ శ్రేణి కోటరీతో ఎలాంటి ముప్పు ఉంటుందో సాయి రెడ్డి ఇప్పటికే సవివరంగా చెప్పారు. కోటరీపై ఆధారపడితే.. చివరకు కోటా మిగలదు, ఆ కోటరీ ఉండదు.

రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. అని జగన్‌కు సాయి రెడ్డి హితవు పలికారు.

పసుపు కోటలోనూ..

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనూ కోటరీ జాడ్యం క‌నిపిస్తోంది. అటు అధినేత చంద్రబాబు, ఇటు యువనేత లోకేష్ పేరిట పలు కోటరీలు తమ పనులు తాము చేస్తున్నాయనే ఆరోపణలు తెరమీదకు వ‌స్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పలు కోటరీలు అధినేతల ఎదుట బలప్రదర్శనలకు అవకాశం ఇచ్చాయి. కానీ, తెలుగుదేశం వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ తరహాలో తాజా అధినేత చంద్రబాబు వారి వ‌ల‌కు చిక్కలేదు. ఎవ్వరికీ దొరకలేదు. ఇందుకు కృష్ణాజిల్లా నేతలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

లోకేష్ బాబు కోటరీ.. చంద్రబాబు కోటరీ.. భువనేశ్వరీ కోటరీ… ఇలా తమకు కోటరీలు లేవని ఎమ్మెల్సీ టిక్కెట్ల ఆశావహులకు తేల్చిచెప్పారు. మీడియా మీటింగుల్లో తమను పొగిడినా.. ప్రతిపక్షాలను తిట్టినా.. ఎమ్మెల్సీ సీట్లు రాలవని నిరూపించారు. కానీ.. ఇప్పటికీ టీడీపీ నాయకత్వం మాత్రం కోటరీ గండంలోనే ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

నయా దళపతులదే హవా..

ఇక జయకేతనం పేరిట పుష్కరోత్సాహంలో మునిగి తేలుతున్న జనసేన పార్టీలోనూ కోటరీ పీడన ప్రారంభమైనట్టు జెండా మోసిన కార్యకర్తలు వాపోతున్నారు. ఇతర పార్టీల నుంచి తరలి వచ్చి.. పార్టీ ఇమేజీతో పదవులను పొందిన నేతల ప్రభావం పెరిగిపోయిందని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనా అధికార పీఠం దక్కితే.. అధికార యోగంతోపాటు కోటరీ ప్రమాదం తప్పదు.

ఇక స్వీయ బలం కోసం.. బలగాన్ని పెంచుకునే వ్యూహంలో కోటరీని దగ్గర చేర్చుకుంటే.. కలిగే కష్టనష్టాలకు బాధ్యులు ఆ లీడర్లే అవుతార‌న్న వాస్త‌వాన్ని తెలంగాణ ఎన్నిక‌ల్లో కోట‌రీని న‌మ్మి దెబ్బ‌తిన్న ఉద్య‌మ‌నేత కేసీఆర్ నిద‌ర్శ‌నం అని చాలామంది సూత్ర‌పాయంగా చెబుతున్నారు.

మ‌రి కోట‌రీ మాట‌లు, మోత‌ల‌కు మురిసిపోయి, మైమ‌రిచిపోయి ప్ర‌జ‌ల‌ను కాద‌ని పాల‌న సాగిస్తే అఖ‌రికి దెబ్బ‌య్యేది మాత్రం పార్టీ అధినేత‌లే అనేది గ‌డిచిన కాలం న‌ర్మ‌గ‌ర్భంగా యాది చేస్తోంది.

Leave a Reply