హైదరాబాద్ – తెలంగాణకు ఎప్పటికి కాంగ్రెస్ పార్టీనే విలన్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు విలన్ గానే తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని తేల్చి చెప్పారు. 16 నెలల్లో సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వచ్చాయని ఆరోపించారు. ఒక్క ఏడాదిలోనే గురుకుల పాఠశాలల్లో 90 మంది విద్యార్థులు చనిపోయారు అని చెప్పుకొచ్చారు.
తెలంగాణ భవన్ లో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభపై ప్రజల్లో చర్చ జరుగుతోంది అని తెలిపారు. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ చెప్పలేదని సీఎం రేవంత్ రెడ్డి తెగ బాధపడుతున్నారు ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ ని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తు పెట్టుకోవడం లేదని అంటూ సెటైర్లు వేశారు జగదీశ్ రెడ్డి.
ఇక, తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ పేరు ఎత్తితే వాళ్ళను నక్సలైట్ల పేరుతో కాల్చి చంపింది కూడా కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. చంద్రబాబు చేతిలో నడ్డి విరిగిన కాంగ్రెస్ 2004లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుందన్నారు.. యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును టీఆర్ఎస్ పెట్టించిందని ఆయన అప్పటి విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడు కేసీఆర్ తిడుతున్న వాళ్ళు నాడు సమైక్యాంధ్ర తొత్తుల కింద ఉన్నారు అని విమర్శించారు..
ఉత్తమ్ కుమార్ వి ఉత్తర కుమార ప్రగల్భాలే …
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డివి ఉత్తర కుమార ప్రగల్భాలని మండి పడ్డారు జగదీశ్ రెడ్డి. ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నారో ఉత్తమ్ కుమార్ లెక్క చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఎన్ని వడ్లు కొన్నారు?.. ఎంత బోనస్ ఇచ్చారో చెప్పాలన్నారు.
ఇక,ఎన్ డి ఎస్ ఎ కాళేశ్వరంపై ఇచ్చిన రిపోర్ట్ నిజమని నిరూపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సవాల్ విసిరారు. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తే ఎవరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని జీవో ఇచ్చారన్నాయి.. మొత్తం 41 వేల కోట్లు రుణమాఫీ అని చెప్పి 21 వేల కోట్లు చేశామని చెప్పారన్నారు. అయితే ఆ 21వేల కోట్లతోనే మొత్తం రైతు రుణమాఫీ పూర్తి అయిందని అంటున్నారు.. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు జగదీశ్ రెడ్డి