హైదరాబాద్ – సాయి సూర్య డెవలపర్స్ కేసు లో టాలీవుడ్ సినీ హీరో మహేష్ బాబు కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. గత నెల ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావలసిందిగా మొదట నోటీసులు ఇచ్చింది. అయితే మహేష్ బాబు షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా ఈడీ అధికారులను సమయం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు.. నేడు విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు.
హాజరుపై సందిగ్ధం..
అయితే ఈ రోజు మహేష్ బాబు విచారణకు హాజరు అవుతారా.. లేదా అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది. మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ ప్రమోషన్ చేశారు. అందుకు రెమ్యూనరేషన్ రూ. 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. రూ. 3.4 కోట్ల నగదు, రూ. 2.5 కోట్లు ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా తీసుకున్నట్లు గుర్తించారు. కాగా ఏప్రిల్ 16న హైదరాబాదులో సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్లలో ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.