AP | విజయవాడలో డ్రగ్స్ కలకలం..

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. గతంలో పలుమార్లు ఆనవాళ్లు నగరంలో లభించగా, తాజాగా బుధవారం రాత్రి నిర్వహించిన పోలీసు తనిఖీల్లో అనూహ్యంగా 33గ్రాముల ఎండీఎంఏ బయటపడింది. డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి సెల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రగ్స్ మూలాలు కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే విజయవాడలోని రామవరప్పాడు రింగ్ వద్ద అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 33 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు పటమట పోలీసులు తెలిపారు.

పటమట పోలీసు స్టేషన్ పరిధిలో రామవరప్పాడు వద్ద అనుమానాస్పద వాహనాల తనిఖీల్లో భాగంగా బుధవారం రాత్రి సిఐ వి పవన్ కిశోర్, యస్.ఐ ఏ దుర్గాదేవి సిబ్బందితో కలసి వాహనాల‌ తనిఖీ చేస్తుండ‌గా రామవరప్పాడు ఫ్లై ఓవర్ వైపు నుండి విజయవాడ వైపు వెళ్తున్న అనుమానాస్పదంగా ఉన్న రెండు వాహనాలను తనిఖీ చేయగా, ఒక ఇనుప పెట్టెలో వైట్ కలర్ క్రిస్టల్ ఎండీఎంఏ డ్రగ్స్ ప్యాకెట్లు రెండు, పర్పుల్ కలర్ క్రిస్టల్ ఎండీఎంఏ డ్రగ్స్ ప్యాకెట్ ఒకటి, రెడ్ కలర్ క్రిస్టల్ ఎండీ ఎంబీ అడ్రస్ ప్యాకెట్ ఒకటి మొత్తం సుమారు 33 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించాయి. రెండు బైకులతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

వీరు నూజివీడుకు చెందిన మనోహర్ అనే వ్యక్తి ద్వారా ఢిల్లీకి చెందిన రింకు నుండి ట్రాక్ ఆన్, డీటీడీసీ కొరియర్ల ద్వారా దిగుమతి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో సనత్ నగర్ కు చెందిన తిరుమలశెట్టి జీవన్ కుమార్, టీచర్స్ కాలనీకి చెందిన బొంతు నితీశ్ కుమార్, యనమలకుదురుకు చెందిన తూలిమెల్లి తరుణ్ ప్రసాద్ లు ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో డ్రగ్స్ లభించడం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply