అనుమతులు లేకుండా టపాసులు నిల్వ ఉంచొద్దు
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు బ్యూరో, అక్టోబర్ 18, ఆంధ్రప్రభ : ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ (SP Vikranth Patil) విక్రయదారులను హెచ్చరించారు. శనివారం ఆయన స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్ లలో టపాసుల విక్రయాలు జరిగే ప్రాంతాలలో పలు జాగ్రత్తలు, సూచనలు పాటించాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు ఆదేశించారు.
ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు (Safety standards) పాటిస్తూ విక్రయించాలని విక్రయదారులకు తెలియజేయాలన్నారు. కేటాయించిన ప్రదేశాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేసుకుని టపాసుల విక్రయాలు చేయాలన్నారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. చిన్న పిల్లలను విక్రయాల పనుల్లో ఉంచుకోరాదన్నారు. లైసెన్స్ లు (Licenses) కల్గిన దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయాలు చేయాలన్నారు. టపాసుల దుకాణాల వద్ద అగ్నిమాపక వాహనాన్ని, అంబులెన్స్ వాహనాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పని చేసి దీపావళి పండుగ సజావుగా నిర్వహించే విధంగా చూసుకోవాలన్నారు.

