‘దీపోత్సవ్’ దివ్య దృశ్యం…

  • రికార్డుల దీపోత్సవం.
  • సరయూ తీరాన త్రేతాయుగ వైభవం
  • గిన్నిస్ పుస్తకంలో అయోధ్య పేరు
  • 26 లక్షల దీపాలతో మెరిసిన అయోధ్య

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జరిగిన తొమ్మిదో దీపోత్సవం వేడుకల్లో అయోధ్య నగరం మరోసారి చరిత్ర సృష్టించింది. ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా జరిగిన ఈ పండుగలో రెండు కొత్త గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు నమోదయ్యాయి.

  • గత సంవత్సరం నెలకొల్పిన 25 లక్షల దీపాల రికార్డును బద్దలు కొడుతూ, ఈసారి ఏకంగా 26,17,215 మట్టి ప్రమిదలను వెలిగించారు.
  • ఒకేసారి అత్యధిక మంది ‘దియా’ భ్రమణం (దీపం రొటేషన్) చేసినందుకు గాను మరొక రికార్డును సొంతం చేసుకున్నారు.

సరయూ నదీ తీరంలోని ఘాట్‌లు, రామ్ కీ పైడి ప్రాంతంలో దీపాల అద్భుత ప్రదర్శన జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పర్యాటక శాఖ, అయోధ్య జిల్లా యంత్రాంగం సంయుక్త కృషి ఫలితంగా ఈ రికార్డులు నమోదయ్యాయి.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హాజరై, సరయూ మాతకు మహా హారతి ఇచ్చి వేడుకలను ప్రారంభించారు. ఈ రికార్డుల సర్టిఫికెట్‌లను ఆయన అందుకున్నారు.

ఈ దీపోత్సవం సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దీపోత్సవం కేవలం పండుగ మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, వారసత్వం, విశ్వాసానికి ప్రతీక అని సీఎం అన్నారు. అయోధ్యను ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ రికార్డుల పరంపర అయోధ్య ఖ్యాతిని ప్రపంచ పటంలో మరింత సుస్థిరం చేస్తుందని తెలిపారు. ఈ ఘనత సాధించడం వెనుక వాలంటీర్ల నిబద్ధత, స్థానిక ప్రజల సహకారం ఎంతగానో ఉందని కొనియాడారు.

కృషి, సాంస్కృతిక వైభవం..

దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ అద్భుతమైన దీపాల పండుగ కోసం అవధ్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన 33,000 మందికి పైగా వాలంటీర్లు కృషి చేశారు. అయోధ్యలోని మొత్తం 56 ఘాట్‌లు, వివిధ ముఖ్య ప్రదేశాలలో దీపాలను వెలిగించడానికి ఈ వాలంటీర్లు అహర్నిశలు శ్రమించారు.

శ్రీరాముడు వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా, త్రేతాయుగ వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దీపాల కాంతితో అయోధ్య ఆధ్యాత్మిక శోభ దేదీప్యమానంగా వెలిగిపోయింది. సాంస్కృతిక ప్రదర్శనలు, డ్రోన్ షోలు, లేజర్ ప్రదర్శనలు, సంగీత నృత్యాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి.

Leave a Reply