ఆదోనికి మొండి చేయి చూపిందా..?
కర్నూలు బ్యూరో, అక్టోబర్ 29 (ఆంధ్రప్రభ): ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన కీలక దశ ప్రారంభమైంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు, పేర్ల మార్పు వంటి అంశాల పై ప్రభుత్వం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఉపసంఘ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా అందిన వందలాది అర్జీలు, వినతులను సీఎం ముందుంచి, జిల్లాల సరిహద్దులు, డివిజన్ పునర్విభజన, కొత్త మండలాల ఏర్పాటు, పేర్ల మార్పుల పై సవివరంగా చర్చించారు. సీఎం సూచనలతో తుది నివేదికను సిద్ధం చేసి, నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదానికి తీసుకువెళ్లే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
డిసెంబర్ 31లోగా పూర్తి ప్రణాళిక –
జనగణన ప్రక్రియ మొదలయ్యే లోపే జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. నవంబర్లో కేబినెట్ ఆమోదం, డిసెంబర్ మధ్యన ప్రజల అభ్యంతరాల స్వీకరణ, చివరగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నది కూటమి ప్రభుత్వ ప్రణాళిక.
ఏడుగురు మంత్రుల సమగ్ర సమీక్ష –
కొత్త జిల్లాల రూపకల్పనకు ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో కమిటీని ఏర్పరచింది. ఆగస్టు 13న సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించిన కమిటీ, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల అభిప్రాయాలను సేకరించింది. ఇప్పటి వరకు 200కు పైగా వినతులు అందగా వాటిని మూడు రోజుల క్రితం సమీక్షించింది. జిల్లా వారీగా ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం, భౌగోళిక పరిస్థితులు, అభివృద్ధి వెనుకబాటుతనం వంటి అంశాలను దృష్టిలో ఉంచి సిఫార్సులు సిద్ధం చేసింది.
ఆదోని జిల్లా ప్రతిపాదనకు మొండి చేయి
కర్నూలు జిల్లాలోని ఆదోని జిల్లా ఏర్పాటు పై ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల డిమాండ్ ఉన్నా, తాజా మంత్రివర్గ కమిటీ నివేదికలో ఆ అంశం ప్రస్తావన లేకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలోనే ఆదోని జిల్లా ఏర్పాటు అవసరమని, ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదోని మండలంలో దాదాపు 1.50 లక్షల పైగా జనాభా, పరిపాలనా యంత్రాంగం కొరత, అభివృద్ధి మందగమనం వంటి కారణాలతో కొత్త జిల్లా అవసరమని ఎమ్మెల్యే తరచూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. స్థానిక ప్రజలు కూడా ఆదోని, హోళగుంద, ఆలూరు, పత్తికొండ వంటి మండలాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని పలుమార్లు డిమాండ్ చేశారు. అయితే.. తాజాగా తయారైన నివేదికలో ఈ ప్రతిపాదన లేకపోవడంతో “ఆదోనికి మొండి చేయి చూపిందా ప్రభుత్వం? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజా అంచనాలు – ప్రభుత్వం సమీక్ష
ప్రభుత్వం పరిపాలనా విభజనలో సమతౌల్యం కాపాడడమే లక్ష్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి. అశాస్త్రీయంగా జరిగిన గత జిల్లాల విభజనలో ఏర్పడిన లోపాలను సరిదిద్దడమే ఈ కసరత్తు ఉద్దేశమని పేర్కొంటున్నాయి. అయితే ప్రజలు మాత్రం అభివృద్ధి వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి. ఆదోని లాంటి ప్రాంతాలు మరోసారి విస్మరించబడకూడదు అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తదుపరి దశలు
నవంబర్ 7న కేబినెట్లో నివేదిక ఆమోదం పొందిన తర్వాత, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ, గెజిట్ నోటిఫికేషన్, ఆపై పరిపాలనా అమలు దశకు ప్రభుత్వం అడుగులు వేయనుంది. డిసెంబర్ 31లోగా మొత్తం ప్రక్రియ పూర్తయితే, 2026 జనవరి నాటికి కొత్త జిల్లాలు పరిపాలనలోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన కసరత్తు తుది దశలోకి ప్రవేశించింది. మార్కాపురం, అమరావతి, ఏజెన్సీ ప్రాంతం వంటి చోట్ల కొత్త జిల్లాల ప్రతిపాదనలు బలంగా ఉండగా, ఆదోని జిల్లాకు మొండి చేయి చూపినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు దృష్టి మొత్తం నవంబర్ 7న జరిగే కేబినెట్ భేటీపై నిలిచింది కొత్త జిల్లాల రూపురేఖలకు అదే కీలకం కానుంది.

