ఏపీ లోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభ మయ్యాయి. దీనిలో భాగంగా నేటి ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు
కాగా, నేటి నుండి 14వ తేదీ వరకు జరుగనున్న వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు.
అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం 6 నుండి అర్చకుల వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశం ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ చేశారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు
.ఈ ఆలయానికి పురాతన, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా అంటారు
.