ఆంధ్రప్రభ, ప్రతినిధి / యాదాద్రి – యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నారసింహా స్వామి దేవాలయంలో ఆదివారం భక్తులతో కిక్కిరిసి పోయింది.. సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో ఆయా రాష్ట్రాల నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. కొండ పైన భక్తులతో కిక్కిరిసి పొగ, క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది..అధికారులు స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

స్వర్ణగిరి క్షేత్రంలో..
భువనగిరి పట్టణ కేంద్రంలోని స్వర్ణగిరి క్షేత్రంలో ఆదివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతః కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించగ, మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధ భరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. శ్రీ అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పంచామృతములు,పసుపు,సుగంధ ద్రవ్యాలతో వేదమంత్రోచ్ఛారణలతో వసంతోత్సవ సేవను శోభాయ మానంగా నిర్వహించారు. జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు సమర్పించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని పూజలు నిర్వహించారు.
