ఢిల్లీ, : పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపై మధ్యవర్తులు అవసరం లేదని ప్రధాని తేల్చి చెప్పారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్కు అప్పగించడం మినహా పాకిస్థాన్కు మరో మార్గం లేదని ఆయన అన్నారు. కాశ్మీర్ అంశం పరిష్కరించుకునేందుకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా చెప్పిన వేళ ప్రధాని వ్యాఖ్యలు ఒక్కసారిగా హీటెక్కించాయి. కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటేనని మోదీ కుండబద్దలు కొట్టారు.
కాశ్మీర్ విషయంలో ఇంతకుమించి మాట్లాడేదేమీ లేదని సుస్పష్టం చేశారు. ఉగ్రవాదులను అప్పగించే విషయంపై పాక్ మాట్లాడితే.. మేమూ మాట్లాడతామని ప్రధాని మోదీ చెప్పారు. ఇక త్రివిధ దళాల అధిపతులకు మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిసిపోలేదని అన్నారు. పాక్ దాడులకు దిగితే.. భారత్ సైతం ఎదురుదాడి చేస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు.పాక్ కాల్పులకు దిగితే గట్టిగా బదులివ్వండంటూ త్రివిధ దళాల అధిపతులకు ప్రధాని మోదీ సూచించారు.
అటు నుంచి తుపాకీ గుళ్లు వస్తే.. భారత్ నుంచి మిస్సైల్స్ ప్రయోగించాలని తెలిపారు. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి కొత్త సందేశం పంపామన్నారు. ఉగ్ర శిబిరాల సహా హెడ్ క్వార్టర్స్ను ధ్వంసం చేశామని చెప్పారు. వైమానిక దాడుల తర్వాత పాకిస్థాన్ చేతులెత్తేసిందని ఆయన పేర్కొన్నారు. సింధూ జలాల ఒప్పందాన్ని సీమాంతర ఉగ్రవాదంతో ముడిపెట్టామని.. ఉగ్రదాడులు ఆగే వరకు ఒప్పందం నిలుపుదలలోనే ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.